అదృష్టమంటే ఇదే: అనంతపురం యాచకుడికి రూ.65లక్షల లాటరీ తగిలింది
అనంతపురం: జిల్లాకు చెందిన యాచకుడు పొన్నయ్యను అదృష్టం వరించింది. బతకడం కోసం యాచకుడిగా మారిన అతనికి భారీ మొత్తం లాటరీలో బహుమతిగా దక్కింది. లాటరీలో రూ. 65లక్షల రావడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
కాగా, పొన్నయ్య ప్రస్తుత నివాసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని మార్తండం(కేరళ) బస్ స్టాండ్. ఒక కాలు లేని అతను బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తున్నాడు. కూడబెట్టిన సొమ్ములో కొంత అనంతపురంలో ఉంటోన్న భార్యకు పంపుతాడు.
మిగిలిన దాంతో లాటరీ టికెట్లు కొంటాడు. రెండు రోజుల కిందట పోలీసులు వచ్చి పొన్నయ్యను స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులతోపాటే వచ్చిన ఓ వ్యక్తి స్టేషన్ కు వెళ్లిన తర్వాత అసలు విషయం చెప్పాడు. పొన్నయ్యకు లాటరీ అమ్మిన అతడు.. 'పొన్నయ్య.. నీకు లాటరీలో రూ.65 లక్షల బహుమతి వచ్చింది' అని చెప్పడంతో ఆనందపరవశుడయ్యాడు పొన్నయ్య.
కాగా, కేరళలో ప్రభుత్వ అనుమతితో లాటరీలు నడుస్తాయిక్కడ. దీంతో ప్రతి సందర్భంలో పోలీసుల ప్రమేయం ఉంటుంది. కాబట్టి బహుమతి వచ్చినవాళ్లను బురిడీ కొట్టించడం అంత తేలికకాదు. లాటరీ మొత్తం కాస్త ఎక్కువ కాబట్టి పొన్నయ్య వాళ్లింటికి కబురు పెట్టారు పోలీసులు.
పొన్నయ్య వాళ్ల నాన్న, అన్నయ్యలు గురువారమే అనంతపురం నుంచి కేరళకు వెళ్లారు. పొన్నయ్య అంగీకారంతో సదరు డబ్బును వాళ్లకు ఇచ్చేశారు పోలీసులు. ఈ డబ్బులతో తన పిల్లల చదువులు, ఇల్లాలి కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నాడు పొన్నయ్య.
మొదట్లో భవన నిర్మాణ కూలీ అయిన పొన్నయ్య పని ప్రదేశంలో కిందపడి కాలు పోగొట్టుకున్నాడు. అప్పట్నుంచి పనికి వెళ్లలేకి బిక్షగాడిగా మారి ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఏపీలో బతుకు మరీ భారంగా మారడంతో కేరళకు వలస వెళ్లి అక్కడా వృత్తిని కొనసాగించాడు. ఇంత డబ్బొచ్చింది కదా, ఇక హ్యాపీగా ఇంటికి వెళతాడేమో అనుకుంటే.. 'అలా కాదు, కేరళలోనే ఉండి అదే వృత్తిని కొనసాగిస్తా'అని చెబుతుండటం గమనార్హం.