మోడీ కేబినెట్ విస్తరణ: జగన్ ఎఫెక్ట్తో తగ్గారా, బాబు దెబ్బ కొట్టారా?
విజయవాడ: నరేంద్ర మోడీ కేబినెట్లో తెలుగుదేశం పార్టీకి మరో బెర్త్ లభిస్తుందని గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. కేంద్రమంత్రి సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపించిన నేపథ్యంలో టిడిపి నుంచి ఒకరికి మంత్రి పదవి వస్తుందని భావించారు.
అయితే, బీజేపీ ఆఫర్ను ఏపీ సీఎం చంద్రబాబు తిరస్కరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తమకు కేబినెట్లో అవకాశం బదులు, ఏపీకి నిధులు, విభజన హామీలను అమలు చేయాలని చంద్రబాబు కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
కానీ, చంద్రబాబు తిరస్కరించారా? ప్రధాని మోడీయే పక్కన పెట్టారా? లేక ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోందా? అనే చర్చ సాగుతోంది. దీని పైన అనేక రకాల ఊహాగానాల వినిపిస్తున్నాయి.
ఏపీలో బీజేపీ నేతలు 2019 వరకు టిడిపికి, వైసిపికి ధీటుగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాన్ని గుర్తించిన టీడీపీయే పక్కకు జరిగిందా, లేక తమ వ్యూహంలో భాగంగా బీజేపీ కేబినెట్లో చోటివ్వలేదా అనే చర్చ సాగుతోంది.
ఒకవేళ బీజేపీ ఇవ్వకుంటే సీఎం చంద్రబాబు దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. కేబినెట్ బదులు నిధులు అడిగానని ఆయన విపక్షాలకు, ప్రజలకు చెప్పేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిడిపి పైన ప్రత్యేక హోదా, విభజన హామీలను గుర్తు చేస్తూ టార్గెట్ చేస్తోంది. కేంద్రం హామీలు నెరవేర్చకుంటే కేంద్ర కేబినెట్లో ఉన్న టిడిపి నేతలు రాజీనామా చేయాలని వైసిపి డిమాండ్ చేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో మరో కేబినెట్ పదవి తీసుకొని చిక్కుల్లో పడటం ఎందుకని చంద్రబాబు భావించి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో, టిడిపిలోను తీవ్రమైన పోటీ నెలకొని ఉందని, అది కూడా ఓ కారణం కావొచ్చునని చెబుతున్నారు.