పవన్ కళ్యాణ్-జగన్లకు 'ముందస్తు' చెక్: చంద్రబాబు వ్యూహమా, జాగ్రత్తలా?
టిడిపి అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే ఎన్నికలు అని, పార్టీ సిద్ధంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
విజయవాడ: టిడిపి అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే ఎన్నికలు అని, పార్టీ సిద్ధంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. రెండేళ్ల సమయం అంటే రాజకీయ పార్టీలకు ఎన్నికలకు దాదాపు దగ్గర పడినట్లే. ఇన్నాళ్లు చేసిన పనిని చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
త్వరలో ఎన్నికలు, సిద్ధంకండి, ఇదీ జగన్ పార్టీ లెక్క: బాబు సంచలనం
అయితే, చంద్రబాబు త్వరలో ఎన్నికలు అని చెప్పడంతో ఇప్పుడు చర్చకు దారి తీసింది. సాధారణ ఎన్నికలు 2018లో వస్తాయేమో అని అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో త్వరలో ఎన్నికలు ఉన్నాయని, అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు పార్టీ కేడర్కు పిలుపునివ్వడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం జాతీయస్థాయిలో బీజేపీ దూకుడు మీద ఉంది.
మోడీ హవా
2014 నుంచి మోడీ హవా, బీజేపీ హవా నడుస్తోంది. మధ్యలో ఢిల్లీ, బీహార్ వంటి ఒకటి రెండు ఎన్నికలు బీజేపీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికలు మరింత కొత్త ఊపును ఇచ్చాయి.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు త్వరలో ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. దీంతో 2018లో ముందస్తు ఎన్నికలు వస్తాయా? వస్తే లోకసభ, అసెంబ్లీకి కలిపి వస్తాయా? లేదా కేవలం అసెంబ్లీకే వస్తాయా అనే చర్చ సాగుతోంది.
అసలు బాబు 'ముందస్తు' ఆలోచన చేస్తున్నారా?
ఎన్నికలకు మరో రెండేళ్లు అంటే అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా.. ఆయా పార్టీలు తమ తమ వ్యూహాలపై మరింత పదును పెట్టేందుకు సమయం వచ్చినట్లే. కాబట్టి చంద్రబాబు మాటల్లో ముందస్తు ఉందని భావించలేమని అంటున్నారు.
అయితే, ఏపీలో మాత్రం అన్ని పార్టీలు అప్పుడే అప్రమత్తమయ్యాయి. అధికార టిడిపి నుంచి ప్రతిపక్ష వైసిపి, 2019లో పోటీ చేస్తానని చెప్పిన జనసేన ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
తెరపైకి పవన్.. చంద్రబాబు వ్యూహమా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో రంగంలోకి దిగాలని నిర్ణయించారు. 2014లో టిడిపి-బిజెపిలను సమర్థించిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు దూరం అవ్వడం దాదాపు ఖాయమని తేలింది. ఆయన లెఫ్ట్ పార్టీలతో జత కడుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కితాబు
ఇప్పటికే లెఫ్ట్ - పవన్ కళ్యాణ్ దగ్గరయ్యారు. ఇటీవల పవన్ ప్రత్యేక హోదా విషయంలో వైసిపి ఎంపీలపై ప్రశంసలు కురిపించారు. దీంతో వైసిపిని కూడా జత కలుపుకుంటారా అనే చర్చ సాగింది.
పవన్కు అధికార వ్యామోహం లేదు కాబట్టి.. ప్రత్యేక హోదా హామీతో జగన్ను సీఎంగా ప్రకటించి జనసేన - లెఫ్ట్ - వైసిపి జతకట్టినా ఆశ్చర్యం లేదనే వాదనలు వినిపించాయి.
వైసిపితో జతకట్టినా కట్టకపోయినా.. తమకు వ్యతిరేకంగా మారుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పుంజుకోక ముందే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారా? లేదా, వైసిపి - పవన్ కళ్యాణ్ దగ్గరవుతారనే ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు 'ముందస్తు'గా సిద్ధమవుతున్నారా అనే చర్చ సాగుతోంది.
రాయలసీమ టిడిపిలో రగడ
ఇక, తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రాయలసీమలో వేడి రాజుకుంది. కడపలో ఆదినారాయణ రెడ్డి వర్సెస్ అమర్నాథ్ రెడ్డి, కర్నూలులో శిల్పా సోదరులు వర్సెస్ భూమా ఫ్యామిలీ, అనంతపురంలోను తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ విభేదాలు పూర్తిగా ముదిరి, పార్టీకి నష్టం జరగకముందే చంద్రబాబు చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
జగన్ పార్టీ డైలమాలో ఉండగానే..
ఇక, వైసిపి ఇటీవల చిక్కుల్లో పడింది. వైసిపి అధినేత జగన్ బెయిల్ రద్దు చేయాలని ఈడీ కోర్టుకు వెళ్లడం, వరుసగా ఎమ్మెల్యేలు వైసిపిని వీడి టిడిపిలో చేరడం.. వంటివి జరుగుతున్నాయి. ప్రధానంగా జగన్ కేసుల కారణంగా వైసిపిలో అంతర్మథనం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా చంద్రబాబు ఏమైనా ముందస్తు ఆలోచన చేస్తున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.