జయసుధ.. 'మా' నుంచి టిడిపి: మురళీ మోహన్ చక్రం తిప్పారా? జగన్కు షాక్
హైదరాబాద్/అమరావతి: సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి జయసుధ శనివారం నాడు హఠాత్తుగా బెజవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి, తెలుగుదేశం పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
2009 ముందు వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న జయసుధ... దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఓడిపోయారు. ఇప్పుడు టిడిపిలో చేరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపికి సేవ చేస్తానని చెప్పారు.
జయసుధ టిడిపిలో చేరడం వెనుక రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జయసుధ టిడిపిలోకి తీసుకు రావడంలో ఆయన పాత్రే ఉందని అంటున్నారు. ఓ విధంగా రాజకీయాలంటే విసుగు చెందిన జయసుధను.. తిరిగి టిడిపిలోకి రప్పించడంలో ఆయన పాత్ర ఉండి ఉంటుందని చెబుతున్నారు.
రాజకీయాలు అంటేనే ఇటీవల జయసుధ ఒకింత విసుగు చెందారని చెప్పవచ్చు. అలాంటి జయసుధ తాజాగా మాట్లాడుతూ... తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని, రెండు తెలుగు రాష్ట్రాలలోను టిడిపికి పని చేస్తానని చెప్పారు. తొమ్మిది పది నెలల క్రితం 'మా' ఎన్నికలు జరిగాయి.
నాడు రాజేంద్ర ప్రసాద్, జయసుధ ప్యానెల్లు పోటీపోటీగా నిలవడంతో 'మా' ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి. జయసుధ వెనుక అప్పుడు ఎంపీ మురళీ మోహన్ ఉన్నారు. అయితే, జయసుధ మా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు జయసుధను ఆయన ఒప్పించి తీసుకు వచ్చి ఉంటారని అంటున్నారు.
జగన్కు ఝలక్!
జయసుధ తెలుగుదేశం పార్టీలో చేరడం ఓ విధంగా వైసిపి అధినేత జగన్కు షాక్ అని చెప్పవచ్చు. జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయసుధను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. వైయస్ మృతి అనంతరం జయసుధ ఇటు కాంగ్రెస్, అటు వైసిపి వైపు కొద్ది రోజులు ఊగిసలాడారు.
కాంగ్రెస్ పార్టీలో ఆమెకు బండ కార్తీక రెడ్డి ప్రత్యర్థి వర్గం. ఆమె ఆధిపత్యం విషయమై జయసుధ ఎప్పటికప్పుడు అసంతప్తుతో ఉండేవారు. ఈ నేపథ్యంలోనే నాలుగేళ్ల క్రితం ఆమె వైసిపిలో చేరేందుకు మొగ్గు చూపినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు.
ఆ తర్వాత రాజకీయాల పైన ఎన్నోసార్లు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇప్పుడు సైకిల్ ఎక్కారు. జయసుధను వైయస్ రాజకీయాల్లోకి తీసుకు రాగా, ఆమె జగన్ స్థాపించిన వైసిపిలో చేరుతారని అప్పట్లో భావించారు. కానీ ఆమె చేరలేదు. అదే జయసుధ ఇప్పుడు టిడిపిలో చేరడం జగన్కు షాకేనని అంటున్నారు.