ఇదీ విషయం!: పవన్పై లోకేష్ సాఫ్ట్కార్నర్ వెనుక!!, ఇదిగో బీజేపీతో చంద్రబాబు లాలూచీ.. భూమన
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వంపై, మంత్రి నారా లోకేష్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీని టార్గెట్ చేసుకోవడంతో టీడీపీ నేతలు జనసేనానిపై విరుచుకుపడుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా సందర్భం వచ్చినప్పుడు పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
Recommended Video
అయితే, పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేస్తే వారి వైఖరి మాత్రం అంతేస్థాయిలో కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నా లోకేష్ తనపై పవన్ చేసిన దాడికి సరైన కౌంటర్ ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ ఒకింత సాఫ్టుగానే స్పందిస్తున్నారు.
శ్రీరెడ్డితో తిట్టించి, పదేపదే మీడియాలో
రూ.10 కోట్లు ఖర్చు పెట్టి మరీ శ్రీరెడ్డితో తనను తిట్టించి, ఆ దృశ్యాలు పదేపదే తమ అనుకూల మీడియాలో వచ్చేలా చేశారని జనసేనాని తీవ్రంగా విమర్శించారు. దీనిపై లోకేష్ ఒకటికి రెండుసార్లు స్పందించారు. తనపై ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. రెండు రోజుల క్రితం కూడా మాట్లాడుతూ.. పవన్ అంటే తనకు గౌరవం ఉందని, ఆయనను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
పవన్ను లోకేష్ గట్టిగా విమర్శించకపోవడం వెనుక..!
అయితే, పవన్ కళ్యాణ్ను లోకేష్ గట్టిగా విమర్శించకపోవడానికి ఓ కారణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో అవసరమైతే జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సి రావొచ్చునని టీడీపీ భావిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరముంటే అనే ఆలోచన వల్లే లోకేష్ పెద్దగా విమర్శలు చేయడం లేదని అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు ఘాటుగా స్పందించడం వేరు.. లోకేష్ స్పందించడం వేరు.
అదే తిరుపతి వేదికపై చంద్రబాబు మోసం చేశారు
నాలుగేళ్ల క్రితం హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా మాట ఇచ్చి మోసం చేశారని, అదే వేదికపై సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. హోదా ద్రోహుల్లో మొదటి ముద్దాయి చంద్రబాబు కాగా, రెండో ముద్దాయి బీజేపీ అన్నారు. ఓట్ల కోసం ప్రజలను వంచించారన్నారు. వంచన, మోసం, కుట్ర, అవినీతిలను చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులుగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నో హామీలు నెరవేర్చలేదన్నారు.
ఆ ఘనత చంద్రబాబుది
తిరుపతి వేదిక నుంచి అక్కాచెల్లెళ్లకు, రైతులకు, నిరుద్యోగులకు, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారని భూమన చెప్పారు. అదే వేదికపై కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి మోసం చేశారన్నారు. చంద్రబాబు జీవితం అంతా దుర్మార్గాలతోనే నడిచిందన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో తీర్మానం చేసి సన్మానాలు కూడా చేశారన్నారు. క్యాండిల్ ర్యాలీకి విశాఖకు వెళ్తే విమానాశ్రయంలోనే నిర్బంధించిన ఘనత చంద్రబాబుది అన్నారు. హోదాను తారకమంత్రంగా మార్చి పోరాటాలు చేస్తున్న వ్యక్తి జగన్ అన్నారు. హోదా అంటే జైలుకు పంపిస్తానని చంద్రబాబు చెప్పారన్నారు.
బీజేపీతో బాబు లాలూచీ రాజకీయానికి ఇదీ నిదర్శనం
చంద్రబాబు తన స్వార్థం కోసం దేవుడినీ వాడుకుంటున్నాడని భూమన అన్నారు. వంచన, మోసం, కుట్ర, కుతంత్రాలు చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులు అన్నారు. టీటీడీ బోర్డులో మహారాష్ట్ర మంత్రి భార్యను ఎలా నియమించారన్నారు. బీజేపీతో బాబు ఇంకా లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనం అన్నారు. చంద్రబాబుది ధర్మపోరాటం కాదన్నారు. తిరుపతిలో చంద్రబాబు సభ పెట్టడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అన్నారు. దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేయించారని, అంతకంటే పాపం మరొకటి లేదన్నారు. బాబుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు.