బాలకృష్ణ క్యాంప్కు తోడుగా..!: జూ.ఎన్టీఆర్ సినిమా రిలీజ్, పవన్ కళ్యాణ్ కేసు
హైదరాబాద్: అత్తారింటికి దారేది చిత్రానికి సంబంధించి తనకు మరో రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని, నాన్నకు ప్రేమతో చిత్రం విడుదలకు ముందే ఇస్తామని నిర్మాత ప్రసాద్ పైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది.
తాజాగా నమస్తే తెలంగాణ పత్రికలో ఓ కథనం వచ్చింది. హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ క్యాంపుకు తోడుగానే పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసినట్లుగా కనిపిస్తోందని, జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో విడుదలకు ముందు రోజు ఫిర్యాదు పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంది.
ఆ కథనం ప్రకారం... 'నందమూరి వారసుల పండుగ వైరం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సంక్రాంతి బరిలో భారీ చిత్రాలతో పోటీ పడుతున్న బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ల పోరాటంలోకి తాజాగా పవన్ కళ్యాణ్ రూపంలో మరో పాత్ర ప్రవేశించింది.
బుధవారం నాన్నకు ప్రేమతో సినిమా విడుదల చేసేందుకు ముందు నిర్మాత ఓ వైపు ప్రయత్నాలు చేస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అత్తారింటికి దారేది చిత్రానికి తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఎగ్గొట్టారంటూ పవన్ మంగళవారం నాన్నకు ప్రేమతో నిరమాత ప్రసాద్ పైన నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు.
పారితోషికం వ్యవహారంపై సరిగ్గా జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ముందు రోజే ఫిర్యాదు చేయడం సినిమా ట్విస్టును మరిపిస్తున్నదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమాను నిర్మించిన ప్రసాద్ గతంలో పవన్ హీరోగా అత్తారింటికి దారేది సినిమాని నిర్మించారు.
ఆ సినిమా విడుదలకు ముందే పైరసీ సీడీలు విడుదల కావడంతో నిర్మాత కంగు తిన్నారు. దీంతో పవన్ కళ్యాణ్, దర్శకులు త్రివిక్రమ్ కొంత మేరకు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధపడ్డారు. సినిమా హిట్ అయితే తన తదుపరి సినిమా విడుదల లోపు ఆ రెమ్యునరేషన్ యథాతథంగా చెల్లిస్తానని నిర్మాత చెప్పారని, కానీ నేటికీ చెల్లించలేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు.
నిర్మాత ప్రసాద్ తనకు ఇంకా రూ.2 కోట్లు చెల్లించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇది నాన్నకు ప్రేమతో విడుదలను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నమనే వాదన బలంగా వినిపిస్తోంది' అని ఆ పత్రిక పేర్కొంది.