ప్రతిపురుషుడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుంది.. మరి జగన్ విజయం వెనక ఉంది ఆ శక్తేనా..??
అమరావతి/హైదరాబాద్ : 2019 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనూహ్య విజయాన్ని అందుకున్నారు. రాజకీయ కురు వృద్దులకె సైతం అంతుచిక్కని ఆదిక్యాన్ని జగన్ సొంతం చేసుకున్నారు. ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అంతటి నీరాజనం పలుకుతారని ఎవ్వరూ ఊహించనూ లేదు. ఇంతటి ఘన విజయం సాధించేందుకు జగన్ వెనక ఓ ఆది పరాశక్తి పని చేసినట్టు తెలుస్తోంది. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక మహిళ సంకల్పం ఉంటుందని అంటారు. ఈ నానుడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి విషయంలో నిజమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ నాయకత్వాన్ని నమ్మి ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన తన పదేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువ సమయం ప్రజల్లోనే ఉండటం. రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందన్నా అక్కడ వారి పక్షాన నిలబడటం ఆనవాయితిగా మార్చుకున్నారు.
సాధారణ ఎన్నికల్లో జగన్ అనూహ్య విజయం..! దాని వెనక ఉంది ఆ ఆదిపరాశక్తేనా..!!
రాష్ట్రం కోసం దీక్షలు, ధర్నాలు చేయడం. ఆయన ఈ పదేళ్లలో కుటుంబంతో గడిపిన సమయం కంటే పార్టీ నేతలు, ప్రజలతో ఉన్న సమయమే ఎక్కువ. ఈ నేపథ్యంలో జగన్ విజయం వెనుక ఆయన సతీమణి శ్రమ ఎంతో ఉంది. తన భర్త నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినా, తన భర్తను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా ఆమె మనోనిబ్బరంతో ధైర్యంగా ఉంటూ తన భర్తకు అండగా ఉన్నారు. ఆమె ధైర్యంగా ఉంటూ భర్తకు అండగా ఉండబట్టే ఇవాళ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.
జగన్ కు అన్ని రకాలుగా సహకరించిన సహ ధర్మచారిణి..! ఓదార్పునిచ్చిన బెటర్ హాఫ్..!!
పదేళ్ల క్రితం వరకు కూడా జగన్ బెంగళూరులో కుటుంబంతో కలిసి మంచి జీవితం గడిపారు. వ్యాపారాలు, కుటుంబం మినహా ఆయనకు ఎటువంటి ప్రాధాన్యతలు లేవు. కుటుంబానికి జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తూ భార్యాపిల్లలతో ఎక్కువ సమయం గడిపేవారు. అయితే, 2009లో రాజకీయాల్లోకి వచ్చి కడప ఎంపీగా పోటీ చేసిన ఆయన వైఎస్సార్ మరణం తర్వాత పూర్తిగా ప్రజల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఓదార్పు యాత్రతో ఆయన కొన్ని నెలల పాటు కుటుంబాన్ని వదిలి ప్రజల్లో గడిపారు.
జగన్ కు కొండంత అండ..! చెక్కుచెదరని ధైర్యంతో ముందుకెళ్లిన భార్య..!!
దీంతో మొదటిసారి ఆయన భార్య వైఎస్ భారతి జగన్ వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. అప్పటివరకు జగన్ ఛైర్మన్ గా ఉన్న సాక్షి గ్రూప్ బాధ్యతలు భారతి తీసుకున్నారు. జగన్ ఇతర వ్యాపారాలను కూడా ఆమె తలకెత్తుకొని సమర్థంగా నడిపించారు. జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూన్నా ఆమె ఆయనకు పూర్తి సహకారం అందించారు. ఇక, వైఎస్ జగన్ పై కేసులు నమోదైనప్పుడు ఆమె ఎంతో మానసిక క్షోభ అనుభవించినా ధైర్యంగా జగన్ కు అండగా ఉన్నారు.
కష్టాలను జయించిన భారతి..! ఎన్నికల్లో భర్తకు ఎంతొ సహకారం..!!
జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు ఆ బాధను దిగమింగుకుంటూనే ఆమె ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు వ్యాపారాలను చూసుకున్నారు. జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సమయంలో ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించారో ఆమె మనస్సుకే తెలుసు. ఇక, ఎన్నికల సమయంలోనూ భారతి భర్త తరపున పులివెందుల నియోజకవర్గంలో పెద్దఎత్తున ప్రచారం చేశారు. జగన్ రాజకీయంగా విజయవంతం అవ్వడంలో భార్యగా భారతి పాత్ర చాలా కీలకం.