ప్రశాంత్ కిషోర్ చిచ్చు!: జగన్ పిలిచినా వంగవీటి నో, గౌతం వ్యవహారం కూడా
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఆయితే, వంగవీటి వైసీపీని వీడటానికి మల్లాది విష్ణు వైసీపీలోకి రావడంతో పాటు మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది.
చదవండి: 'టీడీపీలోకి వంగవీటి రాధా, అంతా మైండ్ గేమ్, పథకం ప్రకారమే': జగన్ 2సార్లు బుజ్జగించినా!
అదే వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే. ఇటీవల వంగవీటి రంగాపై గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. కానీ గౌతమ్ రెడ్డి వెనుక వైసీపీ ఉన్నట్లుగా వంగవీటి వర్గీయులు భావిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు గౌతమ్ రెడ్డి ఇంటికి వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పెడుతున్నారు.
చదవండి: మహేష్ కత్తి సంచలన విషయం చెప్పిన నిర్మాత, రేపు మరిన్ని: కత్తి ఇంటికి పవన్ ఫ్యాన్స్
పీకే సర్వే ఎఫెక్ట్, వైసీపీ లీకులు
మరోవైపు, మల్లాది విష్ణును వైసీపీలో చేర్చుకున్న తర్వాత వైసీపీ అధినాయకత్వం వంగవీటి రాధాను పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడం అనుమానమేనని అంతర్గతంగా ప్రచారం సాగుతోందని అంటున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేస్తున్న సర్వేలన్నీ మల్లాది విష్ణుకు అనుకూలంగా ఉన్నాయని లీకులు ఇస్తున్నారట.
జగన్ నుంచి లేని హామీ, మాట్లాడిన కొడాలి నాని
ఈ ప్రచారం అవుననే విధంగా.. పార్టీ పదవుల విషయంలో తన అనుచరులను తొలగించి ప్రత్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నారని వంగవీటి రాధా వర్గం ఆరోపిస్తోంది. ఈ పరిణామాలను జగన్ దృష్టికి ఆయన తీసుకు వెళ్లినా, ఎలాంటి హామీ లేదని తెలుస్తోంది. అసంతృప్తి విషయం తెలియడంతో కోడాలి నాని వంగవీటితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
జగన్కు నో చెప్పిన వంగవీటి రాధా
ఇటీవల, పాదయాత్రలో తనను కలవాలని వంగవీటి రాధాకు జగన్ సమాచారం పంపారని తెలుస్తోంది. అయితే దీనికి అతను ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. రాధా వర్గీయులు టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం గతంలోనూ జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రచారం ఊపందుకోవడం గమనార్హం.
వంగవీటి వర్గీయులు మాత్రం కాదని
తన అనుచరులకు వంగవీటి రాధాకృష్ణనే పార్టీ మార్పుపై సూచనలు ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని వంగవీటి వర్గీయులు మాత్రం ఖండిస్తున్నారు. వంగవీటి రాధాకు టీడీపీలో చేరుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదని పార్టీ స్పష్టం చేస్తోంది.
చంద్రబాబు వద్ద ప్రస్తావన, అంతర్గత చర్చలు
ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం వంగవీటి రాధా విషయాన్ని చంద్రబాబు వద్ద ఓ కీలక నేత ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది దీనిపై చంద్రబాబు ఎలాంటి ఆసక్తి చూపించపోవడంతో ఆ టాపిక్ అక్కడితో ముగిసిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన తర్వాత విజయవాడలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు. రాధాకృష్ణను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ చేస్తారని, జనవరి చివరిలో క్లారిటీ వచ్చే అవకాశమందని అంటున్నారు.