విజయమ్మ చేదు అనుభవంకు చెక్: విశాఖలో జగన్ 'జై ఆంధ్రప్రదేశ్' వెనుక!
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో జై ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించడం వెనుక కారణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశ్యంలో భాగంగా జగన్ ఈ సభను నిర్వహించారని అంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైయస్ జగన్ ఆదివారం నాడు విశాఖ ఇందిరా స్టేడియంలో జై ఆంధ్రప్రదేశ్ పేరుతో సభను నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ సభను నిర్వహించారు. సభలో టిడిపి, బిజెపిల పైన వైసిపి దుమ్మెత్తిపోసింది.
జీవీఎంసీ ఎన్నికల్లో టిడిపి, బిజెపిని సమర్థవంతంగా ఎదుర్కొనే ఉద్దేశ్యంలో భాగంగా ఈ సభను ఇక్కడ నిర్వహించారని చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచే జగన్ తల్లి విజయమ్మ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి బిజెపి నేత, ఎంపీ హరిబాబు చేతిలో ఓటమి చవి చూశారు.
విజయమ్మ పైన హరిబాబు గెలుపు అసాధ్యమని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా విజయమ్మ ఓటమి చవి చూశారు. ఇప్పుడు జివిఎంసి ఎన్నికల ద్వారా సార్వత్రిక ఎన్నికల ప్రతీకారాన్ని జగన్ తీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీ పైన ఏపీ వాసులు ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు పరిపాలన పైన చాలామంది అసంతృప్తితో ఉన్నారనేది వైసిపి మాట. వీటిని క్యాష్ చేసుకొని, జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని, తద్వారా విజయమ్మ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని, తద్వారా నాటి చేదు అనుభవాన్ని మరిచిపోవాలని భావిస్తున్నారని అంటున్నారు.