పవన్ ఎఫెక్ట్: జగన్ 'సాహసం' వెనుక, అందలమెక్కించే వారిని వదిలేశారా!?
అమరావతి: కాపులకు రిజర్వేషన్లు తన చేతిలో లేదన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత ప్రకటనపై కాపు సమాజంతో పాటు టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు మండిపడుతున్నారు. మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం ప్రతిపక్ష నేతపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. మా రిజర్వేషన్లపై అంత సూటిగా చెప్పినప్పుడు మా ఓటు ఎలా అడుగుతావని ప్రశ్నించారు.
'అందుకే కాపు రిజర్వేషన్లపై అలా': జగన్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్!
కాపులు, ఆయా పార్టీల నేతలు జగన్ వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తూనే తూర్పు గోదావరి జిల్లా పాదయాత్రలోనే ఆ ప్రకటన చేయడం వెనుక వ్యూహం ఏమిటనే చర్చ సాగుతోంది. కాపు రిజర్వేషన్లపై అందరు ఆచితూచి మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు ఇవ్వాలని చెబుతూనే, బీసీలకు అన్యాయం చేయకుండా అని చెబుతున్నారు. గతంలో జగన్ కూడా ముద్రగడకు అండగా నిలిచారు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని స్వయంగా ఆయనే ఆరోపించారు.
జగన్ అంత సాహసం ఎలా చేశారు?
ఈ నేపథ్యంలో జగన్ కాపు రిజర్వేషన్లపై యూటర్న్ తీసుకోవడం వెనుక వ్యూహం ఏమిటనే చర్చ ఆయా పార్టీల్లో అంతర్గతంగా సాగుతోందని అంటున్నారు. పైగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. కీలకమైన కాపు ఓటర్ల ఆగ్రహాన్ని చవిచూసే సాహసం ఎవరూ చేయరు కదా అంటున్నారు. జగన్ వ్యాఖ్యల వెనుక పలు విశ్లేషణలు, ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Recommended Video
పవన్ రంగంలోకి దిగడని భావించారా?
2014లో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేయలేదు. ముద్రగడకు వైసీపీ అండగా నిలబడే సమయానికి జనసేనాని 2019లో పోటీ చేసే విషయమై స్పష్టత లేదు. దీంతో ఆ ఓట్ల కోసం వైసీపీ మద్దతుగా నిలిచి ఉందని అంటున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జనసేన బరిలో నిలుస్తోంది. అప్పుడే ప్రచారం చేస్తున్న పవన్.. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో జగన్ యూటర్న్ తీసుకోవడాన్ని బట్టి చూస్తుంటే.. ఆ సామాజిక వర్గం ఓట్లు తనకు పడవనే ఉద్దేశ్యంతోనే బాహాటంగా ప్రకటన చేశారా అనే చర్చ సాగుతోంది.
కేంద్రం అంటూ తప్పులో కాలేశారా?
పు ఓట్లు జనసేన లేదా చిరంజీవి ఉన్న కాంగ్రెస్ వైపు వెళ్తాయని భావించిన జగన్ ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు అలా చేసి ఉంటారా అనే చర్చ సాగుతోంది. ఆ లెక్కలు వేసుకొని.. కాపు రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిది అని చెప్పి తప్పులో కాలేశారా అంటే కావొచ్చని అంటున్నారు. కేంద్రం పరిధిలో ఉన్న ఇతర అంశాల గురించి పోరాడినప్పుడు, కాపు రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే దీనిపై కూడా పోరాడాలనేది ముద్రగడ ప్రశ్న. ఇది సరైన ప్రశ్నే అనేది చాలామంది అభిప్రాయం. కేంద్రం పరిధిలో ఉన్నదని చెప్పి చేతులెత్తేయడం సరికాదని అంటున్నారు. పైగా తమిళనాడులో రిజర్వేషన్లు సగానికి మించాయని గుర్తు చేస్తున్నారు. ఇన్ని అవకాశాలు ఉండగా తానేం చేయలేనని చెప్పడం.. అనుభవం లేక తప్పులో కాలేశారా లేక వ్యూహాత్మకమా అనే చర్చ సాగుతోంది.
అందలమెక్కించే వారిని వదిలేశారా!?
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలిచే వారు అధికారంలోకి వస్తారనే ఓ అభిప్రాయం రాజకీయ పార్టీల్లో ఉంది. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఆయా పార్టీలు ఈ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాయి కూడా. ఈ రెండు జిల్లాల్లోనే 36 స్థానాలు ఉండటమే అందుకు కారణం. ఈ ప్రభావం పక్కనున్న జిల్లాల్లో కూడా కొంత పడుతుంది. మొత్తంగా చూస్తే ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే అధికారం ఖాయమని భావిస్తారు. అలాంటి జిల్లాలను జగన్ ఇప్పుడు దూరం చేసుకుంటున్నారా అనే చర్చ సాగుతోంది.
వైసీపీ అభిప్రాయం ఇదీ
విపక్షాల విమర్శలు ఇలా ఉండగా, వైసీపీ వారి అభిప్రాయం మరోలా ఉంది. కాపులకు రిజర్వేషన్ కేంద్రం పరిధిలోని అంశమని, దానికి మనం ఏం చేయలేమని, ఇతర పార్టీల్లో చేయలేనివి తాను చెప్పలేనని జగన్ స్పష్టంగా చెప్పారని, తాను ఏం చేయగలనో అవే చేస్తానని దీని ద్వారా కూడా మరోసారి నిరూపణ చేశారని అంటున్నారు. తమ అధినేత ప్రజలను మభ్యపెట్టే వాడు కాదని చెబుతున్నారు. కాగా, కాపు రిజర్వేషన్లపై జగన్ కీలక నిర్ణయం సాహసమేనని, అది ఇతర పార్టీలకు పెద్ద సవాలే అంటున్నారు.