'ఆ రోజు జగన్ ఏం మాట్లాడలేదు, ఎంపీ అభ్యర్థులకు సీట్ల బేరం కోసమే'
విజయవాడ: ఏపీకి త్యేక హోదా కోసం ప్రాణత్యాగాలు, పదవులకు రాజీనామాలు చేస్తామని వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఇప్పుడు చెబుతున్నారని, కానీ విభజన బిల్లు పెట్టిన సమయంలో ఎంపీగా లోకసభలోనే ఉన్నారని, అప్పుడు ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, ఆర్థిక లోటు గురించి కనీసం నోరు మెదపలేదన్నారు. అప్పుడు మౌనం వహించి ఇప్పుడు రాష్ట్రంపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా జగన్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు కాపు, బీసీ, మాదిగలను రెచ్చగొడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి పరిశ్రమల స్థాపనకు ఏపీకి వస్తున్నారని చెప్పారు.
ప్రత్యేక హోదా రావడం కష్టమని భావించిన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి ప్యాకేజీకి తమ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అయినా హోదా ఉన్న రాష్ట్రాల కంటే మెరుగ్గా ఏపీ అభివృద్ధి సాధిస్తోందన్నారు. జాతీయ స్థాయి కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించామన్నారు. ఎంపీ అభ్యర్థులకు సీట్లను బేరం పెట్టడం కోసమే జగన్ రాజీనామాల నాటకాన్ని తెరపైకి తెచ్చారన్నారు.
జగన్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ప్రత్యేక హోదా కోసం జగన్ ఢిల్లీలో ఆందోళన చేయాలని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మల్లి, నగర అధ్యక్షులు ఫిరోజ్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే జగన్ యువతను రెచ్చగొడుతున్నారన్నారు.