కోస్తాకు దూరంగా 'రోను': తప్పిన ముప్పు, ఒకందుకు లాభమే! (ఫోటోలు)
విశాఖపట్నం: కోస్తాంధ్రకు తుఫాను ముప్పు తప్పింది. 'రోను' తుఫాను ప్రభావంతో గత రెండు మూడు రోజులుగా కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు ఎంతో భయాందోళనకు గురయ్యారు. అయితే గురువారం రాత్రి వరకూ నెమ్మదిగా ప్రయాణించిన 'రోను' తుఫాన్ ఇప్పుడు ఒడిశా వైపు వడివడిగా సాగిపోయింది.
విశాఖ తీరం దాటి వెళ్లిపోయింది. శుక్రవారం ఇది తీవ్ర తుఫానుగా మారి భీభత్సం సృష్టిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సమయంలో 'రోను' తుఫాన్ గంటకు 25 కిలోమీటర్లు, తరువాత 30 కిలోమీటర్ల వేగంతో కదలి విశాఖ తీరం నుంచి దూరంగా వెళ్లింది.
అయితే సాధారణ వర్షం మినహా పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం తుఫాన్ పారాదీప్కు దక్షిణ నైరుతిగా, పూరికి ఆగ్నేయంగా, చిట్టగాంగ్కు పశ్చిమ నైరుతిగా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం శుక్రవారం రాత్రి నివేదికను విడుదల చేసింది.
ఉత్తర కోస్తా, ఒడిసా తీరాల నుంచి ఈశాన్యంగా పయనించి శనివారానికి తీవ్ర పెనుతుఫానుగా బలపడనున్నది. ఆ తరువాత తూర్పు ఈశాన్యంగా పయనించి శనివారం రాత్రికి తిరిగి తుఫాన్గా బలహీనపడి దక్షిణ బంగ్లాదేశ్లో కేపుపురా, కాక్స్బజార్ మధ్య తీరం దాటనున్నదని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, తుఫాను ప్రభావంతో గురువారం రాత్రి నుంచి కోస్తాలో, ముఖ్యంగా ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. శనివారం ఉత్తర కోస్తాలో అనేక చోట్ల విస్తారంగా, కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
కళింగపట్నం నుంచి కాకినాడ వరకూ నాలుగు, కోస్తాలో మిగిలిన ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో ఎండ, ఉక్కపోత క్రమేపీ పెరుగుతాయని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో అండమాన్లో అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.
తప్పిన ముప్పు, ఒకందుకు లాభమే!
గతంలో వచ్చిన హుదూద్ తుఫాన్ దెబ్బకు తుఫాన్ అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గడచిన నాలుగు దశాబ్దాలలో ముంచెత్తిన పలు పెను తుఫాన్లు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు తలపునకు వచ్చి భీతిల్లిపోతారు. ఇప్పుడు రాష్ట్రాన్ని తాకిన ‘రోను' సైతం పెను తుఫానే. అయితే, మిగతా తుఫాన్లతో పోల్చితే భిన్నమైనదని అధికారులు చెబుతున్నారు.
తప్పిన ముప్పు, ఒకందుకు లాభమే!
ఈదురుగాలులతో తీర ప్రాంతాలను వణించినా, రాష్ట్రం తనువల్లా ముద్దయ్యేలా, కరువు, వర్షాభావంతో చినుకుకు ముఖం వాచిన ప్రజల తనివి తీర్చేలా భారీ వర్షాలు కురవడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎక్కడా ప్రాణ నష్టం లేకపోవడం, ఆస్తి నష్టం కూడా కొద్దిగానే నమోదు కావడంపై ఊరట చెందుతున్నారు. ఎద్దడిని తరిమేసి, ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టడానికి ఈ వర్షాలు ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తప్పిన ముప్పు, ఒకందుకు లాభమే!
మే నెలలో తీవ్ర ఎండలకు బదులు పుష్కలంగా వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడిందని ఆయన వివరించారు. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వాప్తంగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాల మాట్టాలు పెరిగాయని, తాగు నీటికొరత చాలావరకు తీరిందని జల వనరులు-భూగర్భజలాల శాఖ చెబుతోంది.
తప్పిన ముప్పు, ఒకందుకు లాభమే!
నైరుతీ రుతుపవనాల ప్రభావంతో తొలకరి జల్లులు కురవకముందే, ‘రోను' అడుగుపెట్టడం రాష్ట్రానికి మంచి చేసిందని వివరించింది. భూసారాన్ని పెంచి, నీటి నిల్వల సామర్థ్యాన్ని వృద్ధి చేయడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున తలపెట్టిన ఇంకుడుగుంటల ఉద్యమానికి ‘రోను' మంచి ఊపుని ఇచ్చిందని పేర్కొంది.
తప్పిన ముప్పు, ఒకందుకు లాభమే!
ఈ శాఖ వర్గాలను అనుసరించి.. రాష్ట్రంలో 40,817 చెరువుల్లో సుమారు 215 టీఎంసీల నీరు చేరింది. రోను ప్రభావంతో రాష్ట్రంలో 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఫలితంగా 300 టీఎంసీల నీరు భూగర్భంలోకి చేరి.. 1.20 మీటర్ల మేర మట్టాలను పెంచింది. గత ఏడాది మే నెలలో రాష్ట్రంలో 13.83 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది మే నెలలో 12.40 మీటర్ల లోతుకు చేరాయి.
తప్పిన ముప్పు, ఒకందుకు లాభమే!
రాయలసీమలో గత మే నెలతో పోల్చినప్పుడు 6.08 మీటర్ల పెరుగుదల కనిపించింది. అందులో చిత్తూరు జిల్లాలో ఆరు సెంటీమీటర్ల, కడప జిల్లాలో 28 సెంటీమీటర్లు, అనంతపురం జిల్లాలో 32 సెంటీమీటర్ల పెరుగుదల కనిపించింది. శ్రీకాకుళంలో 56 సెంటీ మీటర్లు, విజయనగరంలో 44 సెంటీమీటర్లు, విశాఖపట్నంలో 119, ప్రకాశంలో 68 సెంటీమీటర్లు, నెల్లూరులో 33 సెంటీమీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.
తప్పిన ముప్పు, ఒకందుకు లాభమే!
శ్రీలంకలో మొదలైన రోను తుఫాన్ అటునుంచి చెన్నై తీరాన్ని చేరింది. అక్కడా నిలవకుండా ఏపీ వైపు కదిలింది. దక్షిణ కోస్తా మీదుగా ఉత్తరాంధ్రలో ప్రభావం చూపింది. అటునుంచి ఒడిశా వైపు కదిలింది. 3 రోజులుగా ఏపీలోనే కదులుతున్న ‘రోను' గమనం తీరిది.
తప్పిన ముప్పు, ఒకందుకు లాభమే!
తాడులా సాగుతూ, ఒక్కపట్టాన ఎక్కడా తీరందాటే ఆలోచన చేయకుండా సాగిపోతూనే ఉంది. అయితే, ఈ సాగదీత ఈ తుఫాను పేరులోనే ఉండటం విశేషం. మాల్దీవులలో ‘రోను' అంటే కొబ్బరి తాడు (కాయర్ రోప్) అని అర్థం. తుఫాన్లు తీరానికి సమాంతరంగా, అప్పుడప్పుడు ఆనుకుంటూ పయనించడం అరుదుగా జరుగుతుంటుందన్నారు.