దేశంలో ఎక్కడా లేని విధంగా...జర్నలిస్టులకు ఇళ్లు:మంత్రి కాల్వ
విజయవాడ : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నామని గృహనిర్మాణ శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రకటించారు. ఆ క్రమంలోనే జర్నలిస్టుల హౌసింగ్ స్కీం పథకానికి రూ. 200 కోట్లు ప్రతిపాదించి, ముందుగా రూ.100 కోట్లు ఇచ్చామని ఆయన తెలిపారు. హౌసింగ్ స్కీమ్ లో మొత్తం నాలుగు రకాల పథకాలు ఉండగా...వాటిలో మూడింటిని జర్నలిస్టులకు వర్తింపజేయాలని చూస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఎపిడబ్యూజెఎఫ్ 10 ఏళ్ల పండుగ సందర్భంగా సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ఎపిడబ్ల్యుజెఎఫ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూ జర్నలిజంలో విలువలు పరిరక్షణకు ఈ ఫెడరేషన్ కృషి చేస్తోందన్నారు.
సమాజంలో మార్పు, ఆశయాలతో పేదవారే ఎక్కువగా జర్నలిజం వృత్తిలోకి వస్తున్నారని మంత్రి తెలిపారు. అయితే అవినీతి, అక్రమాలపై అక్షరాయుధాలు సంధిస్తున్న జర్నలిస్టులకు నేడు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని మంత్రి కాల్వ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాకు కూడా బాగా ప్రాధాన్యం పెరిగిందన్నారు. ఇది అందరి సొంతమైందని మంత్రి కాల్వ వ్యాఖ్యానించడం గమనార్హం.