కూకట్ పల్లిలో నందమూరి సుహాసిని గెలుస్తుందా?...లేదా?...ఏపీలో జోరుగా బెట్టింగ్
Recommended Video
అమరావతి:కాదేది కవితకనర్హం అని మహా కవి శ్రీ శ్రీ కవిత్వాన్ని ఉద్దేశించి రాస్తే...మరి బెట్టింగ్ రాయుళ్లు ఆ కవిత నుంచి స్ఫూర్తి పొందారో ఏమో తెలీదు కానీ ఒకదానికొకటి ఏమాత్రం పొంతనలేని విభిన్న రకాల రంగాలపై పందేలు కాస్తూ అచ్చం అలాగే వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల దృష్టి ఆటల నుంచి సినిమాల కు ఆ తరువాత రాజకీయ రంగంపైకి మళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.
అంతేకాదు బెట్టింగ్ రాయుళ్లు ఎప్పటికప్పుడు లేటెస్ట్ విషయాలపైనే పందేలు కాస్తూ ఉండటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్ల దృష్టి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన కూకట్ పల్లి నియోజకవర్గంపై పడింది. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా ఉన్నా నందమూరి సుహాసిని ఎన్నికల్లో గెలుస్తారా? లేదా? అనే విషయమై తెలంగాణాలో ఏమో కానీ ఏపీలో మాత్రం పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కాస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ నియోజకవర్గంపై...అందరి దృష్టి
తెలంగాణ ఎన్నికల గడువు అత్యంత సమీపిస్తున్న నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే గెలుపు విషయమై ఆ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనూ తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఆ నియోజకవర్గం పేరు అందరూ తేలిగ్గానే ఊహించగలరు....అవును...అది కూకట్ పల్లి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ కోణం నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు విషయమై అంతటి ఆసక్తి నెలకొనడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
ప్రధాన కారణాలు...రెండు
ఒక కారణం ఇక్కడ అభ్యర్థి కాగా రెండో కారణం ఈ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్స్ అత్యధిక సంఖ్యలో ఉండటం. ఇక్కడ నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టిడిపి ఎమ్మెల్యేగా బరిలోకి దిగగా టిఆర్ఎస్ తరుపున తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావే పోటీలో ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గం విశిష్టత విషయానికొస్తే తెలంగాణా రాష్ట్రంలో ఆంధ్రా సెటిలర్స్ అత్యధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదైవున్న నియోజకవర్గాల్లో ఇదొకటి. మరోరకంగా చెప్పాలంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఓటములు డిసైడ్ చేసేది సెటిలర్ల ఓట్లే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
సామాజిక వర్గాల...ఓట్లు ఇలా
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో 3.37 లక్షల మంది ఓటర్లు ఉండగా దాదాపు రెండు లక్షలమంది ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడినవారే. వారిలో దాదాపు 60 శాతం మంది ఉత్తరాంధ్రకు చెందినవారే. సామాజికవర్గాల వారీగా ఓట్లు చూస్తే కమ్మ సామాజికవర్గం ఓట్లు దాదాపు 12 వేల వరకూ ఉండగా...రెడ్డి సామాజికవర్గం ఓట్లు 22 వేల వరకు ఉన్నాయని...కాపుల జనాభా 64 వేల వరకు ఉందని తెలుస్తోంది. అలాగే మైనార్టీల ఓట్లు 63 వేల వరకు ఉంటాయని అంచనా. ఇక్కడ రెడ్డి, కాపు,మైనార్టీల ఓట్లు ఇంత భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో సహజంగా వారు మొగ్గు చూపిన అభ్యర్థికే విజయం సాధించే అవకాశం ఉంటుంది.
అందుకే...తీవ్ర ఉత్కంఠ
తెలంగాణా ఎన్నికల్లో వైసిపి, జనసేన బరిలో లేని క్రమంలో మరి ఇక్కడి ఆంధ్రా సెటిలర్లు ఎపి అధికార పార్టీగా భావించి టిడిపివైపు మొగ్గు చూపుతారా?...లేక వైసిపి, జనసేన పార్టీలు టిడిపిని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి...కెసిఆర్ కు మద్దతుగానే అక్కడ పోటీలో దిగలేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతు తెలుపుతారా?...అనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఇక్కడి ఎమ్మెల్యే గెలుపు తీవ్ర ఉత్కంఠకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇలాంటి పరిస్థితిలపైనే బెట్టింగ్ రాయుళ్ల ఆసక్తి ఉండటం సహజం కనుక ఈ రిజల్ట్ విషయమై ఆంధ్రాల్లోని బెట్టింగ్ రాయుళ్లు పెద్దఎత్తున పందేలు కాస్తున్నారు.
అనేక అంశాలుపై...జోరుగా బెట్టింగ్...
ఈ క్రమంలో బెట్టింగ్ కాసినవారు, కాయాలనుకునేవారు, కాయబోయేవారు వీరంతా కూకట్ పల్లి నియోజకవర్గంలో పరిస్థితులపై రాజకీయనాయకుల కంటే ఆసక్తిగా ఎప్పటికప్పుడు అక్కడి సమాచారం తెప్పించుకుంటూ విశ్లేషించుకుంటున్నారట. అభ్యర్థుల గెలుపోటములు, మెజారిటీ వంటి అంశాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడా?...లేదా?...అనే విషయంపై సైతం వీరు బెట్టింగ్ లకు దిగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ బెట్టింగ్ మొదలెట్టేశారు కాబట్టి ఈ బెట్టింగ్ లు టిఆర్ ఎస్ కు ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశాలకు కూడా విస్తరిస్తున్నాయట. మరి ఈ బెట్టింగ్ ఎంతమంది జీవితాలను ఎలా మార్చేయబోతోందనేది తెలంగాణా ఎన్నికలైతే గానీ తెలియదు.