బెట్టింగ్ భూతం మింగేసింది...అప్పులపాలై ఒక్కగానొక్క కొడుకు కానరాని లోకాలకు...
బెట్టింగ్ భూతం ఓ నవ యువకుడిని కబళించింది...అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఏకైక కుమారుడిని కాటికి పంపించింది. బెట్టింగ్ వ్యసనం కారణంగా బాకీల పాలైన ఆ యువకుడు అప్పులోళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతి గారాబంగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో కన్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ హృదయవిదారకమైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
ఒక్కగానొక్క కొడుకు..
విజయవాడ శ్రీనగర్కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరి దంపతుల ఏకైక కుమారుడు గుర్రం వంశీ తేజ. ఇతడు కేఎల్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎలాగో ఇతడు బెట్టింగ్, ఇతర వ్యసనాల బారిన పడ్డాడు. క్రికెట్ బెట్టింగ్ లలో స్థాయికి మించి డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరకు వాటి కారణంగానే అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి డబ్బు కోసం ఒత్తిళ్లు పెరగటంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అప్పటికే అతడి వ్యవహారశైలి గమనించిన తల్లిదండ్రులు మందలించారు.ఈ నేపథ్యంలో నవంబర్ 2న వంశీ తేజ పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లాడు. ఆరోజు ఇంటికి తిరిగి రాలేదు.
నాన్నకు మెసేజ్ పంపాడు..
ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతని కోసం తిరుగుతుండగానే మరుసటి రోజు వంశీ మొబైల్ నుంచి తండ్రి సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో...నాన్నా.. నాకు బతకాలని లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. అమ్మను జాగ్రత్తగా చూసుకో.. మీ ఆశల్ని నెరవేర్చలేక తనువు చాలిస్తున్నా.. నన్ను క్షమించండి.. అని వుంది. దీంతో ఆ తల్లిదండ్రులకు భూమిబద్దలైనంత పనయింది. తీవ్ర ఆందోళనకు గురైన వంశీ తల్లిదండ్రులు వెంటనే సత్యనారాయణపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వంశీ ఆచూకి కోసం గాలింపు..
పోలీసులు వెంటనే స్పందించి బస్టాండులోని సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించగా వంశీ విశాఖపట్నం వెళ్లే బస్సు ఎక్కుతున్నట్లుగా గుర్తించారు. విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ బీచ్ రోడ్లో తీవ్రంగా గాలించారు. ఎక్కడా వంశీ జాడ తెలియలేదు. వంశీ వాడుతున్న సెల్ఫోన్కు సంబంధించిన సిగ్నళ్లను కూడా టవర్ అక్కడే సూచించింది. ఆ తరువాత వంశీ ఫోన్ స్విచాఫ్ కావడంతో సిగ్నళ్లు అందలేదు. పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పాటు తమ కొడుకు ఆచూకి కోసం ఎక్కని గడపలేదు.. తిరుగని చోటు లేదు...అయినా వారి అన్వేషణ ఫలించలేదు. అలాగే 20 రోజులు గడిచాయి.
చీరాల ఓడరేవులో గుర్తు తెలియని శవం..
మరోవైపు ఈ నెల 21న ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవులో ఓ యువకుడి శవం తేలింది. మృతదేహం బాగా కుళ్లిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో వేటపాలెం పోలీసులు గుర్తు తెలియని శవంగా నమోదుచేసి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆ శవాన్ని సముద్రం దగ్గరే ఖననం చేసేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి జేబులో దొరికిన సెల్ఫోన్లోని సిమ్ తీసి మరో మొబైల్లో వేసి యువకుడి మృతదేహం గురించి తండ్రి వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. దీంతో వంశీ బంధువులు వెళ్లి ఖననం చేసిన ఆ మృతదేహాన్నివెలికితీసి విజయవాడ తీసుకొచ్చారు. పూర్తిగా కుళ్లిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఉన్నమృతదేహాన్నిచూసి అది తమ ఒక్కగానొక్క మారుడిదే అని గుర్తించిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. అదే రోజు వంశీ తేజ కు అంత్యక్రియలు నిర్వహించారు.
బెట్టింగ్ భూతం కారణమని...
అయితే అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడికి ఈ దురవస్థ పట్టడానికి బెట్టింగ్ కారణమని గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆ తల్లిదండ్రులు మరో తల్లిదండ్రులకు తమకు పట్టిన గతి పట్టకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను అర్థించారు. వంశీ తేజ గురించి తెలుసుకున్న వేటపాలెం, సత్యనారాయణపురం పోలీసులు అన్ని కోణాల్లో కేసు విచారణ చేస్తున్నారు. మృతుడు వంశీ ఫోన్ నెంబరుకు సంబంధించి పూర్తి కాల్డేటాను విశ్లేషిస్తున్నారు. చివరిసారిగా ఎవరెవరికి ఫోన్లు చేసింది? ఏ నెంబరు నుంచి ఫోన్లు వచ్చాయి? అన్న కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఓ వ్యక్తికి రూ.20 వేలు బాకీ ఉండడంతో అతడు తన అప్పు చెల్లించాలని వంశీపై బాగా ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖపట్నంలో వంశీ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అక్కడి నుంచి చీరాల వెళ్లాడా? శవం ఇక్కడకు ఎలా వచ్చింది? ఇంటి నుంచి వెళ్లిన తరువాత వంశీ ఈ 20 రోజులు ఏమిచేశాడు? ఎక్కడున్నాడు? అనే విషయాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఏదేమైనా బెట్టింగ్ రాయుళ్లకు వారి తల్లిదండ్రులకు వంశీ తేజ మరణం ఒక హెచ్చరికలా భావించాలని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.