నిమ్మగడ్డ కేసు తీర్పుపై ఉత్కంఠ- అమరావతిలో బెట్టింగ్ ల జోరు... ఎవరెంతంటే ?
ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదాకు కారణమైన మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. గత నెలలో నిమ్మగడ్డను ఎస్ఈసీగా తొలగిస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఇందులో నిమ్మగడ్డతో సహా ఇతర పిటిషనర్ల వాదనలు పూర్తికాగా... శుక్రవారం తీర్పు వెలువడనుంది. ఇది రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి.
నిమ్మగడ్డ కేసు విచారణ- అన్నీ సంచలనాలే...
ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదాకు కారణమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను జగన్ సర్కార్ ఏ క్షణాన ఆర్డినెన్స్ ద్వారా తొలగించిందో కానీ అప్పటి నుంచీ ప్రతీదీ సంచలనమే. నిమ్మగడ్డ స్ధానంలో తమిళనాడు నుంచి జస్టిస్ కనగరాజ్ ను అనూహ్య రీతిలో లాక్ డౌన్ నిబంధనలను కూడా దాటుకుని ప్రభుత్వం కొత్త కమిషనర్ గా నియమించడం, ఆ తర్వాత ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడం చకచకా జరిగిపోయాయి. అయితే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా హైకోర్టు ధర్మాసనం విచారణ చేస్తున్న తరుణంలో పది మందికే లైవ్ లో హాజరు కోసం కోడ్ ఇస్తే అది కాస్తా 40 మందికి చేరడం, వారంతా లైవ్ లోకి రావడం, హైకోర్టు ఛీఫ్ జస్టిస్ చెప్పినా వినిపించుకోకపోవడంతో నేరుగా విచారణకు ఆదేశించడం కూడా తెలిసిందే.
శుక్రవారం తీర్పుపై బెట్టింగ్ లు...
చివరికి నేరుగా విచారణ ప్రారంభించిన హైకోర్టు.. ఇప్పటికే నిమ్మగడ్డ సహా ఇతర పిటిషనర్ల వాదనలు కూడా వినడం పూర్తయింది. రేపు ప్రభుత్వం తరఫున వాదన విన్నాక శుక్రవారం హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. అయితే ఈ తీర్పు రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉందని భావిస్తున్న నేతలు బెట్టింగ్ లకు తెరలేపారు. రాజధాని ప్రాంతంలోని పలుచోట్ల నిమ్మగడ్డ కేసు తీర్పుపై భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు- విజయవాడ రహదారిపై ఉన్న ఓ ప్రముఖ క్లబ్ లో మూడు సామాజిక వర్గాలకు చెందిన వారు నిమ్మగడ్డ కేసు తీర్పుపై బెట్టింగ్ లు వేసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా నిమ్మగడ్డకు అనుకూలంగా 100కు మూడొందలు చొప్పున బెట్టింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల కూడా రహస్యంగా బెట్టింగ్ సాగుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది.
తీర్పుపై సర్వత్రా ఉత్కంఠే కారణం....
హైకోర్టులో నిమ్మగడ్డ కేసు విచారణ ప్రారంభం నుంచే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇందుకు తగినట్లుగానే హైకోర్టు లైవ్ విచారణలో 10 మంది స్ధానంలో 40 మంది రావడం, ఛీఫ్ జస్టిస్ తప్పుకోవాల్సిందిగా కోరినా వినకపోవడంతో అది కాస్తా వాయిదా పడింది. ఇప్పుడు బెట్టింగ్ వ్యవహారం తీసుకున్నా ఎన్నడూ లేనంతగా.. ఈ మధ్య కాలంలో ఎక్కడా విననట్లుగా ఓ ఎన్నికల కమిషనర్ కొనసాగింపు, తొలగింపు వ్యవహారాలపై బెట్టింగ్ సాగడం సాధారణ ప్రజలను సైతం విస్తుపోయేలా చేస్తోంది..
ఉత్కంఠ, బెట్టింగ్ కు కారణాలివే....
ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదాకు కారణమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కోసం ప్రభుత్వం పక్కా ప్లాన్ తో వ్యవహరించింది. ఆర్డినెన్స్ తీసుకురావడం, కేబినెట్, గవర్నర్ ఆమోద ముద్రలు ఇలా ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించింది. అయితే ఈ ఆర్డినెన్స్ ను నిమ్మగడ్డ హైకోర్టులో సవాలు చేయడంతో గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది. అయితే తాజాగా కోర్టు ఈ కేసులో వ్యక్తం చేసిన అనుమానాలు, చేసిన వ్యాఖ్యలతో పిటిషనర్లతో పాటు రాజకీయ నేతల్లో సైతం ఉత్కంఠ పెరిగింది. అదే సమయంలో ఈ కేసు విచారణ సాగుతుండగానే.. కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన లేఖ వ్యవహారంలో ఆయన్ను ఫిక్స్ చేసే దిశగా సీఐడీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు ప్రకటనలు కూడా చేస్తోంది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇదే ఇప్పుడు బెట్టింగ్ లకు కారణం కావచ్చనే వాదన వినిపిస్తోంది.