మద్దెలచెర్వు సూరి అనుచరుడ్ని బట్టలిప్పేసి చితకబాదిన హెబెట్టు మంజు గ్యాంగ్
హైదరాబాద్: మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి ప్రధాన అనుచరుడు మధుసూదన్ రెడ్డిపై హెబెట్టు మంజు గ్యాంగ్ దాడి చేసింది. భూదందాల విషయంలో హెబెట్టు మంజు అనుచరులను మధుసూదన్ రెడ్డి బెదిరించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో భూదందాలు నిర్వహిస్తూ హెబెట్టు మంజు అనుచరుల వ్యవహారాల్లో మధుసూదన్ రెడ్డి తలదూరుస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.
హెబెట్టు మంజు అనుచరులు మధుసూదన్ రెడ్డిని కిడ్నాప్ చేసి, బెంగళూరు శివారులో బట్టలూడదీసి చితికబాదారు, బూటు కాళ్లతో తన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను హెబెట్టు మంజు గ్యాంగ్ విడుదల చేసింది. ఆ వీడియో ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్లో ప్రసారమైంది. తాను తప్పు చేయనని, తనను వదిలిపెట్టాలని మధుసూదన్ రెడ్డి వేడుకోవడం స్పష్టంగా వీడియోలో కనిపించింది.
మా అనుచురులకే అడ్డువస్తావా, ఇలాంటి తప్పులు మళ్లీ చేస్తావా అని ప్రశ్నిస్తూ దాడి చేశారు. దుబాయ్ గ్యాంగస్టర్ హెబెట్టు మంజు అనుచరులది కర్ణాటకలో పేరు మోసిన గ్యాంగ్ అని తెలుస్తోంది. మద్దెలచెర్వు హత్య సమయంలో అతని కారు డ్రైవర్గా వ్యవహరించింది మదుసూదన్ రెడ్డే. సూరి హత్య కేసులో అప్రూవర్గా మారిన మధుసూదన్ రెడ్డి ప్రధాన నిందితుడు భాను కిరణ్ అరెస్టులో కీలక పాత్ర పోషించాడు.
మద్దెలచెర్వు సూరి హత్యానంతరం మధుసూదన్ రెడ్డి బెంగుళూర్ వెళ్లిపోయి అక్కడ రెడ్డప్పరెడ్డి, మరింత మందితో కలిసి పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భూ వ్యవహారాల్లో తలదూరుస్తూ సెటిల్మెంట్లు చేస్తూ హెబెట్టు మంజు అనుచరులకు కొరకరాని కొయ్యగా తయారైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హెబెట్టు మంజు అనుచరులు అతన్ని కిడ్నాప్ చేసి చితకబాదినట్లు సమాచారం.
తాను ఇక భూదందాలకు పాల్పడబోనని, తప్పులు చేయనని మధుసూదన్ రెడ్డి హెబెట్టు మంజు అనుచరులను పదే పదే వేడుకోవడం వీడియోలో కనిపించింది. మద్దెలచెర్వు సూరి ఉన్న కాలంలో హైదరాబాదులో మధుసూదన్ రెడ్డి ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ముసుగులో భూదందాలు నిర్వహించినట్లు చెబుతున్నారు.