జన్మభూమిలో బాహుబలి ఎద్దులు: ఆవు కుమ్మేసి వ్యక్తి మృతి
విజయవాడ: బాహుబలి సినిమాలోని ఎద్దులు ఆంధ్రప్రదేశ్ జన్మభూమి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుంతల రాజ్యాన్ని రక్షించే యజ్ఞంలో బాహుబలికి ఎద్దులు సహకరిస్తాయి. ఆ ఎద్దులు తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో కనిపించాయి.
కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టిన పశుసంపద ఆకర్షణగా నిలిచింది.
బాహుబలి ఎద్దులు, ఒంగోలు జాతి గిత్తలు, పుంగనూరు పశువులతో పాటు టర్కీకోడి, ఒంగోలు గొర్రెలను ప్రదర్శించారు. మహారాష్ట్ర బ్రీడ్కు చెందిన ఈ గిత్తలను దాసరి హరినీడు అనే రైతు వీటిని సంరక్షిస్తున్నాడు.
జన్మభూమి కార్యక్రమంలో జనాలను చూసి బెదిరిపోయిన ఓ ఆవు ఓ వ్యక్తిని కుమ్మింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
బొబ్బిలి మండలం కొత్తపెంట గ్రామంలో బుధవారం జన్మభూమి గ్రామసభకు ఆవును తీసుకొచ్చారు. ఆవు ఉంటే శుభం జరుగుతుందనే ఉద్దేశంతో గ్రామసభ వద్దకు తీసుకువచ్చారు. అయితే జనాలను చూసి బెదిరిన ఆవు పక్కనే ఉన్న బేతనపల్లి సూర్యనారాయణ అనే రైతును పొడిచింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు.