ఇదో గొప్ప అవకాశం: జగన్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న నటుడు భానుచందర్
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ నటుడు భానుచందర్ కలిశారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం ఆయన తన పాదయాత్రను టెక్కలి నుంచి ప్రారంభించారు. ఈ రోజు 329వ రోజు. ఇది కొత్తూరు క్రాస్ రోడ్డు మీదుగా కొనసాగుతుంది.
కలిసి నడిచిన భానుచందర్
జగన్ పాదయాత్రలో భానుచందర్ ఆయనను కలుసుకున్నారు. టెక్కలిలో జగన్ పాదయాత్ర మొదలైన తర్వాత ప్రతిపక్ష నేతతో చేతులు కలిపి కొద్దిదూరం ఆయనతో పాటు కలిసి నడిచారు. జగన్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడారు.
కలిసి నడవడం గొప్ప విషయం
జగన్ ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చానని చెప్పారు. జగన్ అంటే తనకు చాలా అభిమానం అన్నారు. వేల కిలో మీటర్లు నడుస్తూ ప్రజల కష్టాలు తెలుసుకోవటం గొప్ప విషయమని కితాబిచ్చారు. జగన్తో పాటు పాదయాత్రలో కలిసి నడవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు.
ప్రకృతిని ఓడించినట్లు ఊదరగొట్టే చంద్రబాబు
కాగా, తన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. పెథాయ్ తుపానును కూడా చంద్రబాబు ప్రచారానికి వాడుకున్నారంటూ విమర్శించారు. సముద్రాన్ని నియంత్రించినట్లు, తుపానును ఓడించినట్లు ఆయన మైకుల్లో ఊదరగొట్టడం ఏమిటన్నారు. చంద్రబాబు దేవుడిపైన, సృష్టిపైన విజయం సాధించినట్లు చెప్పుకుంటాడని, నవగ్రహాలను నియంత్రించినట్లు చెబుతారన్నారు. ఇస్రో, ఐఎండీ తుపాను హెచ్చరికలు చేసినా కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబు పెథాయ్ నష్టం గుర్తింపు ఒక్కరోజులోనే పూర్తిచేయాలని ఆదేశించడం ఏమిటన్నారు. నష్టాన్ని తక్కువగా చూపి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు.
అచ్చెన్నాయుడుపై విమర్శలు
మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి విశ్వరూపమని జగన్ మండిపడ్డారు. ప్రజలకు ఈత కాయంత మేలు కూడా చేయలేదన్నారు. ఆమదాలవలస, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఇసుక కుంభకోణాలకు అచ్చన్న బిగ్ బాస్ అన్నారు. నియోజకవర్గంలోని కాంట్రాక్టులన్నీ ఆయన సోదరుడికే ఇప్పిస్తారన్నారు. స్వగ్రామం నిమ్మాడలో 20 కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేశారని, చాకిపల్లి మాజీ సర్పంచి అయిన మహిళ దుకాణాన్ని తొలగించారని దుయ్యబట్టారు.