నా భార్యనూ కోర్టులకు తిప్పుతారా, ఈడీలో ఆ ఇద్దరికి బాబుతో సంబంధాలు: జగన్ సంచలనం, ప్రశ్నల వర్షం
అమరావతి: ఈడీ (ఎన్పోర్సుమెంట్ డైరెక్టరేట్) ఛార్జీషీటులో తన సతీమణి భారతి పేరు ఉందని వార్తలు రావడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఓ లేఖ పోస్టు చేశారు.
చదవండి: భారతిపై ఛార్జీషీట్లో ట్విస్ట్!: 'ఈడీ ఉద్యోగులు టీడీపీ నేతల బంధువులు', మోడీని లాగిన తమ్మినేని
ఛార్జీషీటును న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే పత్రికలకు ఎలా తెలిసిందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని పత్రికలకు ఎవరు చెప్పారని నిలదీశారు. తమ మీద బురద జల్లాల్సిన అవసరం ఎవరికి ఉందని అడిగారు. సీబీఐ విచారణలో లేని అంశాలు ఇన్నేళ్ల తర్వాత ఈడీ ఛార్జీషీటులోకి ఎందుకు వచ్చాయో చెప్పాలన్నారు.
చదవండి: అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా భారతి పేరు: ఇంత దారుణమా... షాకైన జగన్
భారతిని కూడా కోర్టు చుట్టూ తిప్పాలనుకుంటున్నారా?
ఈ మేరకు ఆయన ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తన సతీమణి భారతికి ఈ కేసులతో ఏం సంబంధమని జగన్ అడిగారు. భారతిని కూడా కోర్టు చుట్టూ తిప్పాలని కంకణం కట్టుకున్నారా అని అడిగారు. ఈడీకేసులో భారతి పేరు ఉందంటూ ప్రచురించడం చూసి షాక్కు గురయ్యానని చెప్పారు. జడ్జి పరిగణలోకి తీసుకున్నాక ఛార్జీషీటులో ఏముందన్నది మైకానా, ఎవరికైనా తెలుస్తుందని చెప్పారు. జడ్జి పరిగణలోకి తీసుకోకముందే తమకు కూడా తెలియకుండా బయటివారికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు.
ఈడీలోని ఆ ఇద్దరి అధికారుల వేధింపులు
ఈడీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పని చేస్తున్న ఇద్దరు అధికారులు ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈడీ అధికారులు ఉమాశంకర్ గౌడ్, గాంధీలు తమను వేధిస్తున్నారని ఆరోపించారు. వారి వేధింపులపై ఫిర్యాదులు కూడా చేశామని చెప్పారు.
ప్రధానికి ఫిర్యాదు చేశా, కాల్ డేటా తీస్తే బాబుతో సంబంధాలు వెలుగులోకి
చంద్రబాబు ఆదేశాల మేరకు పని చేసే ఇద్దరు ఈడీ ఆధికారుల వేధింపులపై తాము ఇప్పటికే ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశామని జగన్ చెప్పారు. ఈ అధికారుల కాల్ డేటాపై విచారణ జరిపితే చంద్రబాబుతో సంబంధాలు బయటపడతాయన్నారు. ఈ పరిణామాలతో బీజేపీతో కుమ్మక్కు అయింది ఎవరో బయటపడుతుందన్నారు.
చంద్రబాబు పగలు కాంగ్రెస్తో, రాత్రి బీజేపీతో సంసారం
తెలుగుదేశం పార్టీ పగలు కాంగ్రెస్తో కాపురం చేస్తూ, రాత్రి బీజేపీతో సంసారం చేస్తోందని దుయ్యబట్టారు. ఇదీ చంద్రబాబు వ్యవహారం అన్నారు. తాను ఉదయం వార్తలు చూసి నిర్ఘాంతపోయానన్నారు. 2011లో టీడీపీ, కాంగ్రెస్ వేసిన కేసులు అన్నారు. ఇది గడిచిపోయి ఏడేళ్లవుతుందని, ఎన్నో ఛార్జీషీట్లు వేశారన్నారు. తనను కోర్టు చుట్టు తిప్పుతున్నారన్నారు. మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత పెద్ద ఎత్తున ప్రజాధరణ పొందుతున్న తనను టీడీపీ, కాంగ్రెస్ టార్గెట్ చేసి కేసులో ఇరికించాయన్నారు. నేను కేసుల విషయంలో ఏడేళ్లుగా ఎదురీదుతున్నానని, ఏనాడు భయపడలేదన్నారు. సత్యమే గెలుస్తుందన్నారు. ఏడేళ్ల తర్వాత భారతి పేరును చేర్చడాన్ని ఆయన ప్రశ్నించారు.
అందుకే బహిరంగ లేఖ
తమపై బురద జల్లుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నా మీదే కాకుండా మొత్తం నా కుటుంబ సభ్యులను టార్గెట్ చేయాల్సిన శత్రుత్వం ఎవరికి ఉందని అడిగారు. అసలు భారతికి ఈ కేసులతో సంబంధం లేదన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయం ఆలోచించాలన్నారు. అన్ని అంశాలు ప్రజలకు తెలియాలనే నేను బహిరంగ లేఖ రాస్తున్నానని చెప్పారు.