ఏపీ పగ్గాలు భారతీ రెడ్డి చేపట్టబోతున్నారా.. జేసీ వ్యాఖ్యల వెనక మర్మమేంటి..?
అమరావతి: సంక్రాంతి పండగ రోజు కూడా రాజధాని రైతులు తమ ఆందోళనలు కొనసాగించారు. సాధారణంగా సంక్రాంతి పండగ వచ్చిందంటే రైతులు ఎంతో సంతోషంతో ఆనందంతో ఆ రోజున గడుపుతారు. కానీ ఈ సంక్రాంతి రోజున మాత్రం రైతులకు చేదు అనుభవం కలిగింది. కుటుంబ సభ్యలుతో సంతోషంగా చేసుకోవాల్సిన పండగ... ఆందోళనల మధ్య రాజధాని రైతులు చేసుకున్నారు. ఇక రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు రైతులతో పాటు ఆందోలనల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఒక్క కులం వారినే జగన్ టార్గెట్ చేశారు
ఇక ఈ నిరసనల్లో పాల్గొన్న మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి జగన్ సర్కార్పై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ఒక్క కులాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి కాకుండా విశాఖకు రాజధాని తరలిస్తే ఊరుకుండేది లేదని హెచ్చరించారు. త్వరలో జగన్ భార్య భారతీరెడ్డి సీఎం అవుతారని జోస్యం చెప్పిన జేసీ... విశాఖ కాకుండా మరో చోటికి తరలిస్తామని చెపితే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన మండిపడ్డారు. విశాఖపట్నంకు రాయలసీమ వాసులు వెళ్లాలంటే చాలా దూరమవుతుందని జేసీ చెప్పారు. రాజధాని సమస్య 23 గ్రామాలకు మాత్రమే పరిమితం కాలేదని ఇది రాష్ట్ర సమస్య అని చెప్పారు.
రాజధాని నిర్ణయం ఏ ఒక్కరిదో కాకూడదు
పరిశ్రమలు తీసుకురావడంలో చంద్రబాబు ఎంతో కృషి చేశారని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి... ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ హైదరాబాదుకు తరలి వెళ్లిపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ దురదృష్టకరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని మండిపడ్డారు. ఈ రోజు చేసే ఉద్యమం భవిష్యత్ తరాలకోసమే అని జేసీ అన్నారు. జగన్ సీఎం అయ్యాక విజయసాయిరెడ్డి ఢిల్లీకి విశాఖకు చాలాసార్లు తిరిగారని గుర్తుచేశారు జేసీ.రాజధాని నిర్ణయం సీఎం జగన్ ఒక్కరి నిర్ణయమే కాదని అందరి అభిప్రాయాలతోనే రాజధాని నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
ఇద్దరి సీఎంల కలయిక అందుకే
మహాత్మాగాంధీ టెంటులో కూర్చుని ఉంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదని... రాజధాని గ్రామ రైతులు కూడా రోడ్లపైకి వస్తేనే తమ కష్టానికి ఫలితం దక్కుతుందని చెప్పారు. ఏదో ఒక రోజు రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా రోడ్డెక్కాలని జేసీ అన్నారు. చంద్రబాబు శాంతియుతంగా ఉద్యమం చేపట్టాలని చెబుతున్నారని ఇది అన్ని సమయాల్లో పనికిరాదన్నారు జేసీ. మూడు రాజధానుల ఫార్ములాకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మద్దతుగా నిలిచారని ఆరోపణలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. మూడు రాజధానులపై కేసీఆర్ మద్దతు కోసమే జగన్ ఆయన్ను కలిశారన్నారు జేసీ దివాకర్ రెడ్డి.