వెయ్యికోట్లిచ్చాం: వెంకయ్య, ఏపీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, ముంబై అనుకున్నా అంతర్వేదిలోనే
అనంతపురం/ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన ఏపీ రాష్ట్ర రాజధానికి కేంద్రం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం అన్నారు. అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రంలో బెల్ పరిశ్రమకు శంకుస్థాపనం చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. విభజనలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. బెల్ పరిశ్రమకు పాలసముద్రం అనువైన ప్రదేశమన్నారు.
ఇప్పటికే ఏపీకి ట్రిపుల్ ఐటీ, ఐఐటీ వచ్చాయని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ రానుంది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద రూ.1800 కోట్లతో డ్రెడ్జింగ్ హార్బర్ వద్ద డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రతినిధులు అంతర్వేది ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ను తొలుత ముంబైలో ప్రారంభిచాలనుకున్న కేంద్రం.. సాగరమాల ప్రాజెక్ట్లో భాగంగా ఏపీకి కేటాయించింది.
డ్రెడ్జింగ్ హార్బర్లో శిక్షణ, కేంద్రం, మౌలిక సదుపాయాల కల్పన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అంతర్వేది కేంద్రంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కార్యకలాపాలు నిర్వహించనుంది. తొలి విడతగా కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వనుంది. విడతల వారిగా పైమొత్తం వస్తుంది.