ఆళ్లగడ్డ మండలంలో అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న భూమా అఖిల ప్రియ .. కోర్టుకు వెళ్తానని వార్నింగ్ !!
నిన్నా మొన్నటి దాకా బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో ఇరుక్కుని సైలెంటుగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పుడు మరోమారు వైసీపీ సర్కార్ పై పోరాటానికి రెడీ అవుతున్నారు . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై టిడిపి పోరాటాన్ని సాగిస్తున్న సమయంలో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై దృష్టి సారించారు. ఒక పక్క కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఏపీలో రగడ కొనసాగుతున్న సమయంలో భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డలోనూ అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ ఆందోళనకు దిగారు.
Recommended Video
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కృష్ణాపురం శివారులో అక్రమ మైనింగ్ జరుగుతుందని అక్కడకు వెళ్లిన భూమా అఖిలప్రియ రెండువేల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వడానికి అనుమతిస్తే 5లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని తవ్వారని ఆరోపించారు. కృష్ణాపురం గ్రామస్తులు, రైతులు ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు.
మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళిన భూమా అఖిలప్రియ అక్రమ మైనింగ్ ఆపకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా కృష్ణాపురం గ్రామంలో జరుగుతున్న అడ్డగోలు మైనింగ్ ను అడ్డుకునే వరకు టిడిపి పోరాటం చేస్తుందని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. ఇక నిన్నటికి నిన్న జగన్ సర్కార్ పై విరుచుకుపడిన భూమా అఖిల ప్రియ రాష్ట్రంలో యువతను తప్పు దోవ పట్టించి రౌడీలుగా మారుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు.