అమ్మను పోగొట్టుకున్నా: అసెంబ్లీలో తొలిసారి భూమా అఖిలప్రియ
హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలలో అనేకమంది మృత్యువాత పడుతుండటంపై ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు భూమా అఖిలప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం కారణంగా తన తల్లిని పోగొట్టుకున్నానని ఆమె సోమవారం అసెంబ్లీలో జీరో అవర్లో ప్రస్తావించారు.
తొలిసారి అఖిల ప్రియ శాసన సభలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొక్కుబడి సమాధానం కాకుండా చేపట్టాల్సిన చర్యల గురించి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి వివరాలతో సహా సభలో ప్రస్తావించారు.
కేసులపై భూమా నాగిరెడ్డి, రోజా
నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సోమవారం ఉదయం సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. దీనిని సభాపతి కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీనిపై భూమా మాట్లాడుతూ.. తాను నియమాలను అనుసరించే నోటీసు ఇచ్చానని, ఆమోదించాలని కోరారు.
ఎమ్మెల్యేని అని చూడకుండా తన పైన రౌడీషీటు తెరిచారని, ఇవాళ తనకు జరిగిందని, రేపు మరొకరికి జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పైన ప్రశ్నిస్తే, ఇలాంటి కేసులు పెడతారా అన్నారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. కత్తగా సభకు ఎన్నికైన సభ్యుల పైన ఇలాంటి కేసులే పెడుతున్నారన్నారు.
తన పైన కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని చెప్పారు. అయితే, నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన వివాదానికి అసెంబ్లీకి సంబంధం లేదని సభాపతి చెప్పారు. తమ బాధ వినాలను భూమా సభాపతిని కోరారు. పోడియం ముందుకు వచ్చి స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రివనిలేజ్ మోషన్ను ప్రివిలేచ్ కమిటీకి రిఫర్ చేస్తానని చెప్పారు.