ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు విత్ డ్రా...ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రారంభమైన రగడ మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థులను వైసిపి నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని కర్నూలు జిల్లా రెండవ జాయింట్ కలెక్టర్ రామచంద్ర రెడ్డికి, అలాగే పోలీసులకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఫోన్ల స్వాధీనం కోసం పోలీసుల యత్నం .. వాటిలో కీలక సమాచారం ?
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లపై వైసిపి నాయకులు ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారని, టిడిపి అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నట్లుగా చెప్తున్నారని, ఇక అధికారులు సైతం టిడిపి అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టిడిపి అభ్యర్థులు ఎక్కడా సంతకాలు చేయలేదని, టిడిపి అభ్యర్థులు నామినేషన్ లను విత్ డ్రా చేసుకున్నట్లుగా అధికారులు చెప్తున్న దానిపై స్పష్టత ఇవ్వాలని ఆమె రెండవ జేసీని కోరారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు విని పోలీసుల అక్రమ కేసులు బనాయిస్తే, తాము కూడా ఎదురు కేసులు పెడతామని అఖిలప్రియ హెచ్చరించారు. ఆళ్లగడ్డలో వైసీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అఖిలప్రియ. వైసీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు ఇవ్వమని, ఇల్లు రాకుండా చేస్తామని, సంక్షేమ పథకాలు అందనీయకుండా చూస్తామని వైసిపి నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని భూమా అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్న వైసీపీ నాయకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.