అమ్మలేని లోటు, నాన్నపై కేసులు: అఖిలప్రియ
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన ఛాంబర్లో అఖిల చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు, పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారుఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ "అమ్మలేని లోటు ఇప్పటికీ బాధగానే ఉంది. నాన్నపై అక్రమ కేసులు పెట్టి నా ప్రమాణ స్వీకారానికి దూరం చేశారు" అని అన్నారు.
"నాన్న భూమా నాగిరెడ్డి పీఏసీ ఛైర్మన్గా, నేను ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఓకేసారి ప్రమాణం చేయాలని అనుకున్నాం. నాన్న విడుదలయ్యేంత వరకూ నంద్యాల నియోజకవర్గ ప్రజల సమస్యల్లో కూడా భాగస్వామినవుతా. ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్ఆర్సీపీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా" అని చెప్పారు.
దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉప ఎన్నికల్లో విజయం సాధించి నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి అరుదైన రికార్డు సృష్టించారు. వారి విజయానికి కారణమైంది కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ. ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరైన ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి దివంగత భూమా శోభానాగిరెడ్డి, వీరి కూతురు భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించి రికార్డు సృష్టించారు.
ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1989లో గెలుపొందిన భూమా శేఖర్రెడ్డి 1992లో అనారోగ్యంతో మరణించారు. ఆయన స్థానంలో సోదరుడు నాగిరెడ్డి 1992 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి సమీప ప్రత్యర్థి గంగుల ప్రభాకర్రెడ్డిపై విజయం సాధించారు.
1997లో భూమా నాగిరెడ్డి నంద్యాల లోక్సభ స్థానానికి ఎన్నిక కావడంతో ఆళ్లగడ్డ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి సతీమణి భూమా శోభానాగిరెడ్డి మొదటిసారి పోటీచేసి ప్రత్యర్థి ఇరిగెల రాంపుల్లారెడ్డిపై గెలుపొందారు.
గత మేలో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించడంతో ఆళ్లగడ్డలో మరోమారు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఆమె కుమార్తె అఖిలప్రియ తొలిసారి పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమార్తె ముగ్గురూ రాజకీయ ఆరంగేట్రానికి ఉప ఎన్నికలు వేదిక కావడం విశేషం.