భూమా అఖిలప్రియ అరెస్టులో కొత్త కోణం: కింగ్ పిన్: భర్త భార్గవ్ రామ్ ఒక్కడే కాదు..అతని కుడిభుజం
గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపలను రేపిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసు వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ఆమెను ఏ1గా గుర్తిస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఆమె భర్త భార్గవ్రామ్ను ఏ3గా గుర్తించారు. భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటకలోనూ జల్లెడ పడుతున్నారు. అతను మైసూర్లో ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందినట్లు చెబుతున్నారు.
భార్గవ్ రామ్ రైట్ హ్యాండ్..
భూమా అఖిలప్రియను అరెస్టు చేసిన అనంతరం విచారణ సందర్భంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బోయిన్పల్లి కిడ్నాప్ ఉదంతంలో మరో నిందితుడు మాడాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరుకు చెందిన మాడాల శ్రీను.. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్కు ప్రధాన అనుచరుడని నిర్ధారించినట్లు తెలుస్తోంది.
అఖిల ప్రియ, భార్గవ్ రామ్ వేసిన కిడ్నాపింగ్ ప్లాన్ను మాడాల శ్రీను దగ్గరుండి అమలు చేశాడని అనుమానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావును కిడ్నాప్ చేయడానికి మాడాల శ్రీను ఆరు నెలల కిందట స్కెచ్ వేశారని తెలుస్తోంది.
ఆరు నెలల కిందటే రెక్కీ..
దీనికోసం పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. రెక్కీని నిర్వహించిన ప్రతీసారీ.. సీసీటీవీల కంట పడకుండా ఉండటానికి అతను కొన్ని ముందుజాగ్రత్త చర్యలను తీసకున్నాడని భావిస్తున్నారు. బోయిన్పల్లిలోని ప్రవీణ్ రావు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడానికి వినియోగించిన ప్రతీ వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్లను అమర్చినట్లు హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారని సమాచారం.
దీనితో అతని పాత్ర మీద పోలీసుల అనుమానాలు మరింత బలపడినట్లు చెబుతున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో మాడాల శ్రీను పాత్ర ఏ స్థాయిలో ఉందనే విషయంతో పాటు, అతని గత చరిత్ర గురించి టాస్క్ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారని అంటున్నారు.
నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో..
ఇదివరకు కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో మాడాల శ్రీను.. అఖిల ప్రియ తరఫున అన్నీ తానై వ్యవహరించారని తెలుస్తోంది. ప్రచార కార్యక్రమాలను మొదలుకుని.. భూమా అఖిల ప్రియ, అప్పటి నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి షెడ్యూల్ను సైతం మాడాల శ్రీను పర్యవేక్షించేవాడని చెబుతున్నారు. ఈ ఉప ఎన్నిక సందర్భంగా- మాడాల శ్రీనునును భూమా అఖిల ప్రియ ప్రశంసించడానికి సంబంధించిన వీడియో సైతం సోసల్ మీడియాలో వైరల్గా మారిందని అంటున్నారు.
లగ్జరీ లైఫ్..
మాడాల శ్రీను విలాసవంతమైన జీవితానికి బాగా అలవాటు పడ్డాడని, దీనికోసం అడ్డదారుల్లో డబ్బును సంపాదించడం అలవాటు చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా హెలికాప్టర్లో రాకపోకలు సాగించే వాడని చెబుతున్నారు. ఖరీదైన కార్లు, అంతే విలాసవంతమైన బంగళాల్లో తరచూ అతను నివసించే వాడని తేలినట్లు సమాచారం. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన డబ్బును అక్రమ పద్ధతుల్లో సంపాదించే వాడని, దీనికోసం అతను ఇదివరకు కూడా నేరాలకు పాల్పడినట్లు భావిస్తున్నారు.