అఖిలప్రియను తాకాలంటే, తెగిందన్నావుగా: ఏవీ సుబ్బారెడ్డికి మౌనిక గట్టి వార్నింగ్
అమరావతి: తన అక్క భూమా అఖిలప్రియను తాకితే ఊరుకునేది లేదని భూమా మౌనికా రెడ్డి గురువారం హెచ్చరించారు. ఆళ్లగడ్డలో అఖిల, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. అఖిల వర్గం దాడి చేసిందని ఏవీ వర్గం ఆరోపించింది.
ఏవీ సుబ్బారెడ్డి - భూమా అఖిలప్రియల గొడవ
Recommended Video
దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురిని తన వద్దకు రమ్మని చంద్రబాబు చెప్పారు. బుధవారం అఖిల రాలేదు. గురువారం తన సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డి, సోదరి మౌనికా రెడ్డి తదితరులతో కలిసి అఖిలప్రియ చంద్రబాబును కలిసేందుకు అమరావతి వచ్చారు. వారితో పాటు వర్ల రామయ్య వచ్చారు. అంతకుముందు ఆయన భూమా కుటుంబంతో మాట్లాడారు. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడారు.
ఏవీ సుబ్బారెడ్డికి అండగా ఉంటాం కానీ
ఏవీ సుబ్బారెడ్డి వైఖరిని అందరూ చూశారని మౌనిక రెడ్డి మండిపడ్డారు. ఆయన రాజకీయంగా ఎదగాలని అనుకుంటే భూమా కుటుంబం సహకారం ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు. కానీ ఆయన తన రాజకీయ ఎదుగుదల కోసం తన సోదరి అఖిలప్రియను లేదా భూమా, ఎస్వీ కుటుంబాల వైపు వేలెత్తి చూపితే ఊరుకునేది లేదన్నారు. ఇక్కడ కుటుంబం అంటే ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలు తమ కుటుంబాలే అన్నారు.
మీ కూతురు విమర్శించినా ఊరుకున్నాం
ముఖ్యంగా అఖిలప్రియ వైపు వేలెత్తి చూపితే ఊరుకునేది లేదని మౌనికా రెడ్డి అన్నారు. చూస్తూ ఊరుకోమన్నారు. బహిరంగంగా తమను వేలెత్తి చూపిస్తే ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి కూతురు తమపై విమర్శలు చేసినా మాతో కలిసి పెరిగారనే ఉద్దేశ్యంతో ఊరుకున్నామని చెప్పారు. ఇంకా విమర్శలు చేస్తే ఆళ్లగడ్డ ప్రజలు ఊరుకోరని మండిపడ్డారు.
అఖిలను తాకాలంటే.. ఏవీకి మౌనిక హెచ్చరిక
భూమా నాగిరెడ్డి మృతి తర్వాత తాము ఎన్నో ఇబ్బందులు చూశామని మౌనికా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమపై ఎన్ని విమర్శలు చేసినా సహనంతో ఓపిక పట్టామన్నారు. అఖిలను తాకాలంటే భూమా కేడర్ ఉందనే విషయం ఏవీ సుబ్బారెడ్డి గుర్తుంచుకోవాలని ఒక విధమైన హెచ్చరిక జారీ చేశారు. తన అక్క అఖిలప్రియను ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు.
ఏవీ సుబ్బారెడ్డి విమర్శలు సరికాదు
భూమా కుటుంబంతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పే ఏవీ సుబ్బారెడ్డి ఆ కుటుంబంలోని తన అక్కను టార్గెట్ చేయడం ఏమిటని మౌనికా రెడ్డి ప్రశ్నించారు. అక్క ఆళ్లగడ్డలో, మంత్రిగా ఎన్నో బాధ్యతలను చేపట్టి ఎంతో మెచ్యూరిటీతో ముందుకు సాగుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో ఏవీ సుబ్బారెడ్డి విమర్శలు సరికాదన్నారు. అకిలను వేలెత్తి చూపితే ఊరుకునేది లేదన్నారు.
చంద్రబాబుపై నమ్మకం ఉంది
తమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఉందని మౌనికా రెడ్డి చెప్పారు. ఏవీ సుబ్బారెడ్డి తమను ఏమైనా అంటే ఆళ్లగడ్డ ప్రజలు బుద్ది చెబుతారన్నారు. నేనే ప్లాన్ వేస్తే భూమా కుటుంబం ముందుకు వెళ్లదాని ఆయన చెబుతున్నారని, అఖిలను తాకాలంటే కేడర్ ఉందనే విషయం మరుస్తున్నారన్నారు. భూమా కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారన్నారు.
బంధం తెగిపోయిందని చెప్పారు
భూమాతో తనకు అనుబంధం ఉందని చెప్పిన ఏవీ సుబ్బారెడ్డి నిన్నటితో ఆ బంధం తెగిపోయినట్లుగా చెప్పారని మౌనిగా రెడ్డి అన్నారు. తమను ఏమైనా అంటే ఆళ్లగడ్డ, నంద్యాలలోని భూమా కుటుంబం (ప్రజలు) మీకు తగిన బుద్ధి చెబుతారన్నారు. మమ్మల్ని విమర్శిస్తే వారు సహించరన్నారు. అక్కకు మేం తోడుగా ఉంటామన్నారు. ఆ రోజు ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అనుచరులే దాడి చేశారా తేలాల్సి ఉందన్నారు. అలాంటి వాటికి తాము దూరమన్నారు. అప్పుడు అఖిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారన్నారు.