కేసీఆర్ మమ్మల్ని కాపాడండి, పెద్దరికం తీసుకోండి: కేటీఆర్, కవితలకు భూమా మౌనిక వేడుకోలు
హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. ఏపీ సర్కారు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని భూమా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనిక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం కోరారు.
Recommended Video
భూమా అఖిలప్రియపై తప్పుడు కేసులు
తమ అక్క భూమా అఖిలప్రియ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదన్న మౌనిక.. తెలతంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పెద్దరికం తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్టైన నేపథ్యంలో మౌనిక మీడియాతో మాట్లాడారు. తమ సోదరిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
అఖిలప్రియ, భార్గవ రామ్ ప్రాణాలకే ప్రమాదం..
అఖిలప్రియను గాంధీ ఆస్పత్రి నుంచి పోలీసులు తీసుకెళ్లిన విధానం కూడా సరిగా లేదని మండిపడ్డారు. ఆమె ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జైలులో తన సోదరికి సరైన వైద్యం కూడా అందించడం లేదని అన్నారు. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పరారీలో ఉన్న భార్గవరామ్ లొంగిపోతే అతని ప్రాణానికే ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆడపిల్లలపై అంతకక్ష ఎందుకు?.. తమకూ ప్రాణహాని
అసలు ఏ ఆధారాలతో తన సోదరి అఖిలప్రియను అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు మౌనిక. ఇవన్ని చూస్తుంటే తన సోదరి ప్రాణానికి ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని, ఏ2గా మార్చి స్టేషన్ నుంచి విడుదల చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఆడపిల్లలపై అంత కక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. మనం పాకిస్థాన్లో ఉన్నామా.. హైదరాబాద్లో ఉన్నామా? తమ సోదరితోపాటు తమకు కూడా ప్రాణహాని ఉందన్నారు. తమను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ ఆదుకోండంటూ భూమా మౌనిక ఆవేదన
ప్రవీణ్ రావు ముఖ్యమంత్రి బంధువని మీడియా ద్వారానే తెలిసిందని చెప్పారు. హఫీజ్ పేట భూములు తమవేనని, ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు కూడా తమ వద్దనే ఉన్నాయన్నారు. భూ వివాదం తమ తండ్రి ఉన్నప్పటి నుంచి ఉందని, ఆయన చనిపోయాక ఇలా ప్రవర్తిస్తున్నారని మౌనిక ఆరోపించారు. తమ తల్లిదండ్రులు ఆళ్లగడ్డకో.. కర్నూలుకో పరిమితమైన నేతలు కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. హఫీజ్ పేట భూ వివాదం చాలా మంది పెద్దలున్నారని, తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్దలు రాజకీయంగా తమను భయాందోళనలకు గురిచేస్తున్నారని వాపోయారు. అందుకే కేసీఆర్, కేటీఆర్, కవితలు తమను ఆదుకోవాలని మౌనిక వేడుకున్నారు.