శోభతో లవ్ మ్యారేజ్, ప్రధానిపైనే పోటీ చేసి మెజార్టీ తగ్గించిన భూమా
మూడేళ్ల వ్యవధిలోనే శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో శోభా కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు భూమా గుండెపోటుతో హఠాత్మరణం చెందారు.
ఆళ్లగడ్డ: మూడేళ్ల వ్యవధిలోనే శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో శోభా కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు భూమా గుండెపోటుతో హఠాత్మరణం చెందారు.
భూమా నాగిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ-మూడు పార్టీలు..
నాడు శోభ మృతి చెందిన విషయం తెలియగానే భూమా స్పృహ తప్పి పడిపోయారు. శోభా లేకుంటే తాను అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తితో సమానమని, తన కూతురు అఖిల ప్రియలో తాను శోభను చూసుకుంటున్నానని చెప్పేవారు.
ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో భూమ తన భార్య గురించి చెప్పారు. శోభ-భూమలది లవ్ మ్యారేజ్. మేనత్త కూతురు అయినప్పటికీ కుటుంబ సభ్యులలో విభేదాల ఉన్నాయి. ఫ్యాక్షన్ ప్రభావం కారణంగా శోభను ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించలేదేమోనని అభిప్రాయపడ్డారు. అయితే, శోభ - భూమాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ప్రధానిపై పోటీ కలకలం
ప్రధాన మంత్రి హోదాలో నంద్యాల ఎంపీగా పోటీ చేసిన పీవీపై టిడిపి తమ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డిని నిలబెట్టడం అప్పట్లో రాజకీయంగా ఎంతో కలకలం రేపింది. 1991లో దేశ ప్రధాని హోదాలో పీవీ నంద్యాల ఎంపీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు టీడీపీ తరుపున నాటి సీఎం ఎన్టీఆర్ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో పీవీ ఏకపక్షంగా జరిగిన పోలింగ్తో 5,80,035 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించారు.
ఎవరూ ముందుకు రాక..
అయితే ప్రధాని హోదాలోనే 1996లో జరిగిన ఎన్నికల్లో మరోసారి పీవీ నరసింహారావుపై పోటీ చేసేందుకు స్థానిక నేతలు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డిని అధిష్టానం దేశ ప్రధాని పైనే పోటీకి నిలపడంతో, ప్రధానిపై పోటీ చేసిన పిన్న వయస్కుడిగా భూమా నిలిచారు.
ప్రధాని మెజార్టీని తగ్గించిన ఘనత భూమా రికార్డు
1991లో పీవీ నర్సింహా రావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినప్పుడు 5,80,035 మెజార్టీ వచ్చింది. అయితే 1996లో పీవీపై భూమా నాగిరెడ్డి పోటీ చేసిన సమయంలో రికార్డు మెజార్టీ భారీగా తగ్గింది. ఈఎన్నికల్లో పీవీ 98,530 మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ప్రధాని మెజార్టీని భారీగా తగ్గించిన నాయకుడిగా భూమాకు నంద్యాల రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.
భూమా ఓటములు
1999 నుంచి 2004 వరకు ఎంపీగా ఉన్న భూమా నాగిరెడ్డి 2004లో జరిగిన ఎన్నికల్లో ఆళ్ళగడ్డ శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాగిరెడ్డి సతీమణి భూమా శోభానాగి రెడ్డి కూడా ఓటమిని చవిచూశారు.
ఈ నేపథ్యంలో 2008లో సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి చేరి జిల్లా వ్యాప్తంగా చక్రం తిప్పారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా నంద్యాల ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు.
ఎట్టకేలకు గెలుపు
అయితే ఆళ్ళగడ్డ నియోజక వర్గం నుంచి శోభానాగిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత వైయస్ జగన్ స్థాపించిన వైసిపిలో చేరి 2014లో గెలుపొందారు. అనంతరం టిడిపిలో చేరారు.
సినిమా రంగంలోను..
భూమా కుటుంబానికి రాజకీయాల్లోనే కాకుండా సినీ రంగంతోను పరిచయం ఉంది. వీరబ్రహ్మేంద్ర కంబైన్స్ మూవీ క్రియేషన్ సంస్థ పేరుతో పలు చిత్రాలను రూపొందించారు. సుమన్ కథానాయకుడిగా పలు చిత్రాలను నిర్మించారు. భూమా నాగిరెడ్డి నిర్మాతగా ఊహ కథానాయికిగా 'నా కూతురు' అనే చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో నిర్మించారు. పలు చిత్రాలకు బయ్యర్లుగా వ్యవహరించారు.
మిత్రులు
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ భూమా నాగిరెడ్డికి మంచి మిత్రులు. మోహన్ బాబు కుటుంబంతో భూమా కుటుంబానికి ఎంతో అనుబందం ఉంది. రాఘవేంద్ర రావుతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు.