ఆత్మరక్షణలో జగన్, అప్సెట్: షాక్.. సుజయ కంటే భూమా బెటర్!
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దెబ్బకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. గతంలో కంటే భిన్నంగా పార్టీ వీడే ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. వరుసగా చాలామంది పార్టీ వీడుతుండటంతో జగన్ అప్ సెట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఆయన సైకిల్ ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు జగన్.. విజయసాయి రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తదితరులను పంపించారు.
కానీ సుజయ నుంచి వారికి ఎలాంటి ఆశించిన స్పందన రాలేదు. వారు వస్తున్న విషయం తెలిసి.. సుజయ కుటుంబ సభ్యులతో సహా మరో ప్రాంతానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సుజయ తమకు చిక్కకుండా వెళ్లిపోవడంతో షాకైన విజయ సాయి తదితర నేతలు ఏం చేయలేక తిరుగు ముఖం పట్టారు.
ఈ నేపథ్యంలో వైసిపిలో ఓ చర్చ జరుగుతోంది. సుజయ కంటే కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన భూమా నాగిరెడ్డి చాలా నయం అని చెవులు కొరుక్కుంటున్నారట. జగన్ సూచన మేరకు మాట్లాడేందుకు వచ్చిన చెవిరెడ్డితో చర్చించేందుకు భూమా తొలుత నిరాకరించారు.
కానీ ఆ తర్వాత చెవిరెడ్డిని ఇంట్లోకి తీసుకెళ్లు సుదీర్ఘంగా మాట్లాడారు. తన సమస్యలు చెప్పుకున్నారు. జగన్ పట్ల తన అసంతృప్తిని కూడా వెళ్లగక్కినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తాను ఎందుకు పార్టీ మారుతున్నానో చెవిరెడ్డికి పూసగుచ్చారు. కానీ సుజయ మాత్రం వైసిపి నేతలను కలిసేందుకే ఇష్ట పడటం లేదని అంటున్నారు.