చిరంజీవి-జగన్లను కాదని మళ్లీ.. అప్పుడే భూమా పేరు వెలుగులోకి!
నంద్యాల ఎమ్మెల్యే దివంగత భూమా నాగిరెడ్డి కర్నూలు రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. ఆయన ఎన్ని పార్టీలు మారినా అభిమానులు, కార్యకర్తలు ఆయన లేదా వారి కుటుంబం వెంటే ఉన్నారు.
కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే దివంగత భూమా నాగిరెడ్డి కర్నూలు రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. ఆయన ఎన్ని పార్టీలు మారినా అభిమానులు, కార్యకర్తలు ఆయన లేదా వారి కుటుంబం వెంటే ఉన్నారు.
భూమా కన్నుమూత, రేపు అంత్యక్రియలు: కుటుంబ సభ్యుడ్ని కోల్పోయాం: బాబు-జగన్ షాక్
1992లో ఎమ్మెల్యేగా గెలుపు
8 జనవరి 1964లో దోర్నిపాడు మండలం కొత్తపల్లి గ్రామంలో భూమా నాగిరెడ్డి జన్మించారు. 1992లో తన సోదరుడు భూమా శేఖర్ రెడ్డి మృతి తర్వాత ఆయన రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న శేఖర్ రెడ్డి మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భూమా గెలుపొందారు.
మూడుసార్లు ఎంపీగా.. పీవీపై పోటీ చేసి ఓడారు
భూమా నాగిరెడ్డి మూడుసార్లు లోకసభ ఎంపీగా పని చేశారు. 11, 12, 13వ లోకసభలలో ఎంపీగా ఉన్నారు. ఆయన వరుసగా మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.
1996లో నాటి కాంగ్రెస్ పార్టీ నంద్యాల లోకసభ అభ్యర్థి పీవీ నర్సింహా రావుపై టిడిపి భూమా నాగిరెడ్డిని పోటీ చేయించాలని నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు నానింది. అప్పుడే భూమా పేరు ప్రధానంగా వెలుగు చూసింది. తర్వాత పీవీ నంద్యాల స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా టిడిపి తరపున బరిలోకి దిగిన భూమా సమీప ప్రత్యర్థి రంగయ్యనాయుడుపై దాదాపు 4,00,000 ఓట్ల తేడాతో విజయం సాధించి లోకసభకు వెళ్లారు.పీవీ చేతిలో భూమా ఓడిపోయారు. అయినా ఆయన లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారు.
తండ్రి హత్య: మెడిసిన్ మధ్యలో ఆపేసి..
తండ్రి బాల్ రెడ్డి హత్యకు గురైన సమయంలో భూమా నాగిరెడ్డి మెడిసిన్ చదువుతున్నారు. ఆయన మెడిసిన్ విద్యను మధ్యలో ఆపేసి వచ్చారు. ఆ తర్వాత కర్నూలు రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు అయ్యారు.
1984లో రాజకీయ ప్రవేశం
భూమా నాగిరెడ్డి 1984లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1986, 1990లలో ఆళ్లగడ్డ మండల అధ్యక్షులుగా ఉన్నారు. 1992లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు
భూమా నాగిరెడ్డి - శోభ దంపతులకు ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందులో అఖిల ప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్య శోభా నాగిరెడ్డి రెండేళ్ల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.
1998లో ప్రత్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డితో...
ఆళ్లగడ్డ అంటే భూమా, భూమా అంటే ఆళ్లగడ్డ పేరు గుర్తుకు వస్తుంది. అలాంటి ఆళ్లగడ్డలో 1998లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూమా ప్రత్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి పైన కేవలం 4 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.
రూటు మార్చి సత్తా చాటిన భూమా
తనకు మంచి పట్టున్న ఆళ్లగడ్డలో గంగుల పైన కేవలం నాలుగువేల ఓట్లతో గెలవడంతో భూమా నాగిరెడ్డి తన రూటు మార్చుకున్నారు. కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉన్నారు. పార్టీని, తన పట్టును పెంచుకున్నారు. దీంతో ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో 72వేలకు పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. దాంతో తన సత్తా చాటారు.
నాలుగు పార్టీలు మారారు
భూమా కుటుంబానికి టిడిపితో దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన ఎన్నో ఏళ్లు టిడిపిలో ఉన్నారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన అనంతరం భార్య శోభతో కలిసి వైసిపిలో చేరారు. 2014లో శోభ మృతి చెందారు. ఆ తర్వాత కొద్ది నెలల క్రితం తిరిగి భూమా, ఆయన కూతురు అఖిల ప్రియ టిడిపిలో చేరారు.
ప్రజారాజ్యంలో ఓటమి, వైసిపి నుంచి గెలుపు
2008లో ప్రజారాజ్యంలో చేరిన భూమా నాగిరెడ్డి 2009లో నంద్యాల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన శోభా నాగిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత రెండేళ్లకు జగన్ స్థాపించిన వైసిపిలో చేరారు. 2014లో వైసిపి తరఫున నంద్యాల నుంచి భూమా గెలిచారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు శోభ కన్నుమూశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూతురు అఖిలప్రియ గెలిచారు.