"ఓటుకు నోటే ఆయుధంగా చంద్రబాబు.. అందరి ఫోన్లు ట్యాపింగ్"
హైదరాబాద్ : పారిశ్రామికవేత్తలు, పోలీస్ అధికారులు, పత్రికా యజమానులు.. ఇలా అనేకమంది ఫోన్లను ట్యాప్ చేస్తూ ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై అందరిని కలుపుకుని పోరాటం చేస్తామని తెలిపారు.
ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పడానికి తమవద్ద పక్కా సాక్ష్యాధారాలున్నాయని చెప్పారు భూమన. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేవారిని లోబర్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు భూమన. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. దాన్నే ఆయుధంగా మలుచుకుని తమకు అనుకూలంగా కథనాలు రాస్తున్న పత్రికా యజమానుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర హోంశాఖ అనుమతితో దేశద్రోహానికి పాల్పడేవారి ఫోన్లను మాత్రమే ట్యాప్ చేస్తారని, కానీ చంద్రబాబు అలాంటి నిబంధనలేవి పట్టించుకోకుండా ప్రజాస్వామ్యానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారుల ఫోన్లు ట్యాప్ చేస్తూ.. వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన భూమన.. చంద్రబాబుకు దమ్ముంటే ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదని స్పష్టం చేయాలన్నారు.
ఆఖరికి బీజేపీ నేతలను సైతం చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారి జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన భూమన.. ప్రభుత్వం వైఖరిని నిలదీసేందుకు అందరు ఒకటవాల్సిన అవసరముందన్నారు.