కన్నీళ్లతో దాష్టీకం, చంద్రబాబు ఏడిస్తే దయ్యాలు ఏడ్చినట్లే: భూమన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అప్పు ఇవ్వడమంటే బ్యాంకులు విజయ్ మాల్యాకు అప్పులు ఇచ్చినట్లేనని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
చార్మినార్ బ్యాంక్, కేశవరెడ్డి, అగ్రి గోల్డ్ సంస్థల్లా చంద్రబాబు కూడా బోర్డు తిప్పేయగలరని అన్నారు. రాజధాని నిర్మాణం పేర చంద్రబాబు ప్రభుత్వం లక్షా 20 వేల కోట్ల రూపాయల భారన్ని ప్రజలపై వేసిందని అన్నారు.
అమరావతిలో వెతికినా కనిపించదు
అప్పు చేసి చంద్రబాబు ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదని అమరావతిలో వెతికినా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. అమరావతి అనే పీఠానికి చంద్రస్వామి అనే పీఠాధిపతిగా మారి దొంగల కన్నా దారుణంగా దోచుకోవడం దాచుకోవడం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఒక్క రోజైనా నిజాయితీగా బతికారా..
అలాంటి చంద్రబాబు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద సమాజం వినలేదని మాటలు మాట్లాడుతున్నారని భూమన అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రోజైనా నిజాయితీగా బతికారా అని అయన ప్రశ్నిచారు.
ఎన్టీఆర్ ఎపిసోడ్ నిదర్శనం
"ఎంతకైనా దిగజారే మీరు గొప్పలు చెప్పించుకోగలరు. ఎదగడం కోసం నీచపు ఎత్తుగడలు వేసి అడ్డం వచ్చినవారిని తొలగించుకోగలరని భూమన అన్నారు. ఎన్టీఆర్ ఎపిసోడ్ అందుకు మంచి ఉదాహరణ. కానీ ఇప్పుడు మీకు భజన చేసే ప్రసార మాధ్యమాలు చాలా వచ్చాయి. సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే నిజాలు తెలుస్తునన్నాయి" అని భూమన అన్నారు.
దయ్యాలు, భూతాలు ఏడ్చినట్లే
కన్నీళ్లతో ఎన్ని దాష్టీకాలు చేసినా సామాజిక మాధ్యమాల ద్వారా కొట్టుకుపోక తప్పదని భూమన చంద్రబాబును హెచ్చరించారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది కాబట్టి జగన్ వ్యక్తిత్వం మీద దాడి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఏడిస్తే దయ్యాలు, భూతాలు ఏడ్చినట్లేనని ఆయన అన్నారు మొసళ్ల వద్ద కన్నీరు అరువు తెచ్చుకున్నట్లేనని వ్యాఖ్యానించారు.