జగన్ తాతను చంపించారు, వైయస్ వల్లే చంద్రబాబుకు నాడు పదవి: భూమన
పదిహేనేళ్ల తర్వాత పత్తికొండలో బాంబు పేలిందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం అన్నారు. వైసిపి నేత నారాయణ రెడ్డి హత్యగావించబడ్డ విషయం తెలిసిందే.
తిరుపతి/కర్నూలు: పదిహేనేళ్ల తర్వాత పత్తికొండలో బాంబు పేలిందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం అన్నారు. వైసిపి నేత నారాయణ రెడ్డి హత్యగావించబడ్డ విషయం తెలిసిందే.
చదవండి: అందుకే నారాయణ రెడ్డి హత్య, రక్షణపై కొత్త ట్విస్ట్
గవర్నర్ నరసింహన్ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారు. వైసిపి నేతలు ఆయనను కలిసి ఈ హత్యపై ఫిర్యాదు చేశారు. అనంతరం బుగ్గన మాట్లాడారు.
సీబీఐతో విచారణ జరిపించాలి
నారాయణ రెడ్డి హత్యపై సిబిఐతో విచారణ జరిపించాలని బుగ్గన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల వైఫల్యాన్ని తాము గవర్నర్కు వివరించామన్నారు. శాంతిభద్రతలను ఎస్పీ రవికృష్ణ గాలికి వదిలేశారన్నారు. ఏపీలో శాంతిభద్రతలు అధ్వాన్నం అన్నారు. ఈ మూడేళ్లలో కర్నూలులో 300 హత్యలు జరిగాయన్నారు.
రాజారెడ్డిని చంద్రబాబు చంపించారు: భూమన
ఏపీలో అసలు సిసలు ఫ్యాక్షనిస్టు చంద్రబాబు అని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. జగన్ తాత రాజారెడ్డిని చంపించింది కూడా చంద్రబాబే అని సంచలన ఆరోపణలు చేశారు. రాజారెడ్డిని చంపిన హంతకులను చంద్రబాబు తన నివాసంలో 30 రోజుల పాటు ఉంచుకున్నారన్నారు.
కుట్ర ప్రకారమే నారాయణ రెడ్డి హత్య
పథకం ప్రకారమే నారాయణ రెడ్డి హత్య జరిగిందని భూమన అన్నారు. ఆయన గన్ లైసెన్స్ను రెన్యూవల్ చేయకపోవడంపై వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. టెర్రరిస్ట్ యాక్టివిటీకి చంద్రబాబు కిరీటధారి అన్నారు.
వైయస్ కుటుంబాన్ని వాడుకున్న చంద్రబాబు
గతంలో అవసరాల కోసం వైయస్ కుటుంబాన్ని చంద్రబాబు వాడుకున్నారని భూమన ఆరోపించారు. 1981లో వైయస్ రాజశేఖర రెడ్డి దయతోనే అంజయ్య మంత్రివర్గంలో చంద్రబాబుకు పదవి వచ్చిందన్నారు. చంద్రబాబు కిరాతకాలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు.