చంద్రబాబుకు మంచి ఛాన్స్, ఎంపీలతో ప్రారంభిద్దాం.. కక్కుర్తిపడి: భూమన
నేడు ఒక ప్రాచీన క్రీడను, సంస్కృతిని కాపాడుకునేందుకు తమిళులు చేస్తున్న పోరాటం, నాడు అభివృద్ధి పేరిట తెలంగాణ పౌరులు చేసిన పోరాటాన్ని మించేలా, ఏపీ పౌరుల భవిష్యత్తును కాపాడేందుకు హోదా కోసం పార్టీలకు అతీతం
హైదరాబాద్: నేడు ఒక ప్రాచీన క్రీడను, సంస్కృతిని కాపాడుకునేందుకు తమిళులు చేస్తున్న పోరాటం, నాడు అభివృద్ధి పేరిట తెలంగాణ పౌరులు చేసిన పోరాటాన్ని మించేలా, ఏపీ పౌరుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రత్యేక హోదా కోసం పార్టీలకు అతీతంగా పోరాడుతామని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం అన్నారు.
పార్టీలు, వ్యక్తుల స్వప్రయోజనాల కంటే తెలుగు జాతి మొత్తం ప్రయోజనాలు ముఖ్యమని నిరూపించుకునే సమయం చంద్రబాబు వినియోగించుకోవాలని హితవు పలికారు. ఈ పోరాటాన్ని ఎంపీల రాజీనామాలతో ప్రారంభిద్దామన్నారు.
రాయపాటి కంపెనీ.. కేసు పెడతారా: బాబుకు పవన్, ఇదీ జనసేన డిమాండ్
ప్రత్యేక హోదాకు అడ్డుగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఉన్నారని ధ్వజమెత్తారు. ఆయన తమతో పాటు హోదాకు సై అంటే మొత్తం తెలుగు జాతిని ఏకం చేసి భారత దేశానికి ఆదర్శమయ్యే పోరాటాన్ని కలిసికట్టుగా నిర్మిద్దామన్నారు.
రవాణా వ్యవస్థను, మొత్తం యంత్రాంగాన్ని స్తంభింప చేసి అయినా ప్రత్యేక హోదా సాధించాల్సిన అవసరముందన్నారు. జల్లికట్టు కోసం తమిళులు సుప్రీం కోర్టు తీర్పును సైతం పక్కన పెట్టారని, ఆర్డినెన్స్ తెచ్చేలా చేశారన్నారు.
అలాంటిది ప్రత్యేక హోదా పైన మనం ముందుకు వెళ్లలేమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలుగు జాతి ఏకం కావాలన్నారు. హోదాకు అడ్డు చంద్రబాబు అని ఆరోపించారు. ఎంపీలందరిని రాజీనామా చేయమని చెబుతామని, ఈ ఉద్యమం చేయకుంటే భవిష్యత్తు తరాలకు మంచి అవకాశాలు పోతాయన్నారు.
ఇప్పటికే హోదా ప్రయోజనాలు వివిధ ఉద్యమాల ద్వారా ప్రజలకు చెప్పామని, భారత దేశానికి ఆదర్శం అయ్యేలా పోరాటం చేద్దామన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా హామీని నెరవేర్చేదాకా పోరాడుదామన్నారు.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు కేంద్రానికి లొంగిపోయి వారి అడుగులకు మడుగులొత్తుతున్నారన్నారు. ఎక్కడ జైలుకు వళ్లవలసి వస్తుందోనని, సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందోనని చంద్రబాబు ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నారన్నారు.
తెలుగు జాతిని జాగృతం చేయాలన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నీచ రాజకీయాలతో ఆంధ్రుల హక్కులను కాలరాయవద్దన్నారు. పోలవరం కమీషన్ల కోసం కక్కుర్తిపడి నీచ రాజకీయాలతో ఆంధ్రుల హక్కులను కాలరాస్తున్నారన్నారు.
హోదాను ఒక సవాల్గా తీసుకోవాలని, చంద్రబాబుకు సూచించారు. తెలుగు ప్రజల్లో నిరాశ, నిర్లిప్తత తీసుకు వచ్చింది మీరేనని, ఇప్పటికైనా మరోసారి ఆలోచన చేయాలన్నారు. చంద్రబాబు కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొని, చిత్తశుద్ధితో ముందుకు రావాలన్నారు. రాజీనామాలతో ఆరంభించి ఉద్యమాన్ని ఉధృతం చేసి హోదా సాదిద్దామన్నారు.