జగన్ను బద్నాం చేసేందుకే: చంద్రబాబు దాష్టీకానికి ఇది పరాకాష్ట అన్న భూమన
అమరావతి: తుని ఘటనకు సంబంధం లేని నాకు నోటీసులివ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దాష్టీకానికి పరాకాష్ట అని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం భూమన సీఐడీ విచారణ ముగిసింది. గుంటూరు సీఐడీ కార్యాలయంలో సుమారు ఆరు గంటల పాటు సీఐడీ అధికారులు భూమన కరుణాకరరెడ్డిని విచారించారు.
విచారణ ముగిసిన అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అప్రజాస్వామ్యక పద్దతులను ప్రయోగించినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాపు కులం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూధర్ఫర్డ్ లాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబే ఎన్నికల మేనిఫెస్టోలో
ఏ ఉద్యమం కూడా ఉక్కుపాదాలతో అణిగిపోయే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబే ఎన్నికల మేనిఫెస్టోలో కాపులు బీదరికంతో బాధపడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే వాళ్ల జీవితాలను కాంతి వంతం చేస్తానని, వాళ్లందరినీ బీసీలుగా మారుస్తానని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాపు జాతి అవమానపడింది
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మాటను ఖూనీ చేయడంతో కాపు జాతి అవమానపడిందని, మోసానికి గురైందని, నష్టపోయిన కాపు జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటానికి తాము మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మద్దతిస్తామని తెలిపారు.
పాము-కప్పలాంటిది
చంద్రబాబుకు, కాపులకు మధ్య సంబంధం పాము-కప్పలాంటిదని ఆయన అన్నారు. తుని ఘటనతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, కేవలం ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చినందుకు తమ నాయకుడు జగన్ను బద్నాం చేయడానికి దాని వెనక మా పార్టీ కుట్ర ఉందని మొదటి రోజు నుంచే సీఎం, హోం మంత్రి అంటున్నారని ఆయన గుర్తుచేశారు.
మళ్లీ రేపు ఉదయం రమ్మన్నారు
ఈ క్రమంలో పోలీసుల చేత నాటకం ఆడించే ప్రక్రియను చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారని అన్నారు. అయితే పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. తుని ఘటనకు సంబంధించి వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. సీఐడీ అధికారులు మళ్లీ రేపు ఉదయం రమ్మన్నారని, రేపు మళ్లీ విచారణకు హాజరై సీఐడీ అధికారులు అడిగిన సమాచారం ఇస్తానని ఆయన తెలిపారు.