రహస్యంగా ఎందుకు?, బాబు 'భూతల స్వర్గం' ఇంటిపై ఇంత గోప్యతా?: భూమన
గత మూడేళ్ల కాలంలో ఏపీ ప్రజల కోసం ఒక్క పక్కా ఇల్లు కూడా నిర్మించని చంద్రబాబు తన ఇంటిని మాత్రం రహస్యంగా వందల కోట్లతో నిర్మించుకున్నారని అన్నారు.
హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తా.. అది చేస్తా.. ఇది చేస్తా.. అంటూ గొప్పలు పోయిన సీఎం చంద్రబాబు తన ఇంటిని మాత్రం సింగపూర్. దావోస్, షాంఘై, తరహాలో అత్యంత భారీ ఖర్చుతో నిర్మించుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
ఏపీ ఉద్యోగులందరిని అమరావతికి తరలించిన చంద్రబాబు తన ఇంటిని మాత్రం హైదరాబాద్ లో ఎందుకు కట్టుకున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో రహస్యంగా భూతల స్వర్గం లాంటి ఇంటి నిర్మించుకున్న ఆయన దాని రహస్యాన్ని ఎందుకు బయటపెట్టడం లేదని అన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ ఇంటి రహస్యాన్ని చంద్రబాబు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు.
అదే సమయంలో ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు తెరిచిన పుస్తకం లాంటిదని భూమన చెప్పారు. ఆయన ఇంటికి నిత్యం వందలామంది వచ్చి పోతుంటారని తెలిపారు. సీఎం చంద్రబాబు మాత్రం తన ఇంటి నిర్మాణాన్ని రహస్యంగా ఉంచడం పట్ల భూమన అనుమానం వ్యక్తం చేశారు.
గత మూడేళ్ల కాలంలో ఏపీ ప్రజల కోసం ఒక్క పక్కా ఇల్లు కూడా నిర్మించని చంద్రబాబు తన ఇంటిని మాత్రం రహస్యంగా వందల కోట్లతో నిర్మించుకున్నారని అన్నారు. చంద్రబాబు కొత్తగా నిర్మించుకున్న ఇంటిలో ఒక్కో అడుగు మార్బుల్ కు రూ.30వేల నుంచి రూ.40వేల దాకా ఖర్చు పెట్టారని భూమన అన్నారు.
హైదరాబాద్లో సీఎం కార్యాలయాలు, ఇళ్లు పేరిట చాలావరకు ప్రజాధనం వృథా చేశారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లలో 8ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాల నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల వెచ్చించిందని ఆరోపించారు. టీడీపీ నాలెడ్జ్ సెంటర్ జగన్ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే తాము చంద్రబాబు ఇంటి గురించి మాట్లాడాల్సి వస్తుందని అన్నారు.