"అవినీతిలో దేశంలోనే నంబర్.2.. ఇకనైనా కళ్లు తెరువు బాబు"
ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనపై వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరెడ్డి విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనపై వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరెడ్డి విమర్శలు గుప్పించారు. అవినీతిలో చంద్రబాబు సర్కార్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని, సీఎంఎస్ సర్వేలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు.
అవినీతి పాలనలో, ప్రజలను వంచించడంలో చంద్రబాబును మించినవారు లేరని భూమన అన్నారు. అవినీతితో వేల కోట్ల రూపాయలు వెనకేసుకుని, అదే డబ్బుతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవినీతిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని సీఎంస్ సర్వే తేల్చిన తర్వాతైనా చంద్రబాబు కళ్లు తెరవాలని అన్నారు.
ప్రజాక్షేత్రంలో వైసీపీని ఎదుర్కోలేకనే తమ అధినేత జగన్ పై లేని పోని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని భూమన మండిపడ్డారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేసేందేమి లేదన్నారు. ఎంతసేపు సొంత డబ్బాలు కొట్టుకోవడానికే చంద్రబాబు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కియా కంపెనీ రెండు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని చంద్రబాబు చెప్పిన విషయం అబద్దమని భూమన అన్నారు. ఒక మిలియన్ డాలర్ పెట్టుబడికి మాత్రమే తాము అంగీకరించినట్లు ఆ కంపెనీయే తెలిపిందని చెప్పారు. ఇకనైనా చంద్రబాబు అసత్యాలు వల్లించడం మానుకోవాలని సూచించారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన భూమన ఈ వ్యాఖ్యలు చేశారు.