"నంద్యాల వీధుల్లో వీధిరౌడీల్లా మంత్రులు.. ప్రజలకు కసి తీర్చుకునే ఛాన్స్"
అభివృద్ధితో కాకుండా అవినీతి డబ్బుతోనే ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ఆరోపించారు.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నికను టీడీపీ పాలనపై జనం ఇచ్చే రిపోర్టుగా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. సీఎం చంద్రబాబు 6కోట్ల మందికి చేసిన ద్రోహానికి నంద్యాల ప్రజలకు కసి తీర్చుకునే ఛాన్స్ దొరికిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా అభిప్రాయపడ్డారు.
నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబుకు ఇక్కడి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పబోతున్నారని అన్నారు. భవిష్యత్తు గెలుపుకు నాందిగా.. నంద్యాల ఉపఎన్నికను జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నామని భూమన తెలిపారు. గెలుపు కోసం నంద్యాల ప్రజలను టీడీపీ మభ్య పెడుతోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి.. మంత్రులంతా ఇక్కడే మకాం వేశారని, ఓటమి భయంతోనే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులనే లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు ఆర్కేనగర్ ఉపఎన్నిక కంటే ఎక్కువగా నంద్యాలలో అవినీతి డబ్బు ప్రవహిస్తోందని, ఏ టీడీపీ వాళ్ల ఇంటికి వెళ్లి వెతికినా డబ్బు పట్టుబడుతుందని ఆరోపించారు.
అభివృద్ధితో కాకుండా అవినీతి డబ్బుతోనే ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ఆరోపించారు. మంత్రులు తమ స్థాయిని మరిచిపోయి.. నంద్యాలలో వీధి రౌడీల తరహాలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అంటేనే తెగించి దౌర్జన్యాలకు పాల్పడే పార్టీ అని అన్నారు.