టీడీపీ గోడలను పడగొట్టగల సత్తా ఆయనకే: భూమన
కడప: తెలుగుదేశం పార్టీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్సార్ ఆలోచనలే తమ పార్టీ సిద్ధాంతమని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణ ఆలోచన ఉందని.. రాజకీయం అంటే అధికారం అనే సిద్ధాంతం ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిదేనని ఆరోపించారు.
టీడీపీ గోడలను ఒట్టి చేతులతో పడగొట్టగల ధీరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని భూమన అన్నారు. జీవితాంతం గర్వపడేలా చెప్పుకునే నాయకుడు జగన్ అని, అధికారం ఒకరు వేస్తే తీసుకుని భిక్ష కాదని.. పోరాడి సాధించుకునే హక్కు అన్న వ్యక్తి జగన్ అని అన్నారు.
10జన్పథ్లో నిటారుగా వైయస్ జగన్ నిల్చున్నారని.. వందసార్లు కుంగదీయడానికి ప్రయత్నించినా లొంగని మనిషని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాకుండా.. తండ్రి ఆశయ సాధన కోసం జగన్ పోరాటం చేస్తున్నారని, అలాంటి నేతకు చేదోడువాదోడుగా ఉంటామని అన్నారు. రాష్ట్రంలోని 5కోట్ల ఆంధ్రులకు మళ్లీ వైయస్ పాలన అందిద్దామని భూమన అన్నారు.