'వైఎస్ది ప్రమాదం కాదు, వెనక అనేక శక్తులు, అందుకే..'
వైఎస్ మరణం వెనక అనేక శక్తులున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గ్యాస్ నిక్షేపాల కేటాయింపు నేపథ్యంలోనే ఆయన మరణించారని చెప్పారు.
చిత్తూరు: దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మృతి వెనుక అనేక శక్తులున్నాయని, విచారణకు డిమాండ్ చేసినా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏ మాత్రం స్పందించలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి ఆరోపించారు.
శుక్రవారం చిత్తూరులో జరిగిన నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పనామా, గ్వాటిమాలా దేశాల అధ్యక్షులు తమతమ దేశాల్లోని చమురు ఉత్పత్తులపై అమెరికా గుత్తాధిపత్యాన్ని ఎదిరించి విమాన ప్రమాదాల్లో మరణించిన ఉదంతాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అదే తరహాలో రాష్ట్రంలోని గ్యాస్ నిక్షేపాలు ఇతరులకు కేటాయించడాన్ని వ్యతిరేకించినందుకే వైయస్ రాజశేఖర రెడ్డి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఆయన ఆరోపించారు. వైఎస్ మరణం వెనుక అనేక శక్తు లు కలసి పనిచేశాయని, విచారణ జరిపించాలని తాము ఎంత గొంతు చించుకున్నా అప్పటి యూపీఏ ప్రభుత్వం గానీ, సోనియాగాంధీ గానీ పట్టించుకోలేదని అన్నారు.
సొంత వాళ్లనే కాపాడలేని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక రాష్ట్రంలో మహిళలను ఏం రక్షిస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ప్రశ్నించారు. సొంత జిల్లాలో సొంత పార్టీకి చెందిన చిత్తూరు మేయర్ అనురాధ తనకు రక్షణ కల్పించాలని పోలీసు శాఖను పలుమార్లు కోరినా పట్టించుకోలేదని, చివరకు ఆమె భర్తతో పాటు దారుణ హత్యకు గురయ్యారని ఆమె అన్నారు.