భువనేశ్వరి,బ్రాహ్మణిలు తెర మీదకు రావటం చంద్రబాబు వ్యూహమా: ఏపీలో జోరుగా చర్చ
Recommended Video
రాజకీయాల్లో సీనియర్ గా సుదీర్ఘ అనుభవంఉన్న చంద్రబాబు గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా దెబ్బ తిన్నారు. గతంలో లేని విధంగా టీడీపీకి నూతన సారధ్యం కావాలనే చర్చ తెరమీదకు వచ్చింది. ఇక ఇదే సమయంలో లోకేష్ చంద్రబాబు స్థానాన్ని భర్తీ చెయ్యలేడని, జూనియర్ ఎన్టీఆర్ అయితేనే కరెక్ట్ అని చర్చ పదేపదే ఏపీలో జరుగుతుంది. ఇక ఈ నేపధ్యంలో చంద్రబాబు వేస్తున్న స్టెప్స్ ఆసక్తికరంగా మారాయి.
అమరావతి కోసం ఆందోళనల్లో పాల్గొన్న భువనేశ్వరి, బ్రాహ్మణిలు
అధికారంలో ఉన్నప్పుడు కానీ, విపక్షంలో ఉన్న వేళలోనూ ఎప్పుడూ రాజకీయ సభలకు, ఆందోళనా కార్యక్రమాలకు, వేదికల మీదకు రాని బాబు సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి అమరావతి పోరాటంలో పాలు పంచుకోవటం కొత్త రాజకీయ సమీకరణాలకు కారణం అవుతుందా అన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతుంది. రాజధాని అమరావతి రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని చేస్తున్న పోరాటానికి మద్దతుగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా మందడం, వెలగపూడి, తుళ్లూరులో జరిగిన దీక్షా శిబిరాలలో బాబు వెంట భువనేశ్వరి, బ్రాహ్మణిలు కూడా పాల్గొనటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
రాజకీయ వారసుడిగా లోకేష్ ను వ్యతిరేకిస్తున్న టీడీపీ
చంద్రబాబు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్ ప్రభావం చూపించకపోవటం, మాటల్లో చాకచక్యం చూపించలేకపోవటం ,ఆయన మాటలు, చేతలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ చెయ్యటం వంటివి రాజకీయాలలో లోకేష్ స్ట్రాంగ్ గా నిలబడలేడు అన్న భావన టీడీపీ శ్రేణులకు వచ్చేలా చేశాయి. ఇక ఇదే సమయంలో టీడీపీలో కీలకంగా పని చేసి బయటకు వెళ్ళిన నేతలు లోకేష్ టార్గెట్ గా విమర్శలు గుప్పించటం , పదేపదే పప్పు అని లోకేష్ ను సంబోధించటం సైతం టీడీపీ అధినేతను ఆలోచనలో పడేశాయి అన్న భావన తాజా పరిణామాలతో కలుగుతుంది.
రంగంలోకి భువనేశ్వరి, బ్రాహ్మణిలు .. చంద్రబాబు వ్యూహమా ?
అందుకే చంద్రబాబు లోకేష్ కు బదులుగా రాజకీయ వారసుల్ని తెర మీదకు తీసుకొచ్చే ప్లానింగ్ లో బాబు ఉన్నారా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. రాజకీయంగా చంద్రబాబు చూసినన్ని సంక్షోభాలు,సవాళ్లు మరెవరు చూసి ఉండరు. కానీ ఏ సమయంలోనూ తన సతీమణి భువనేశ్వరిని కానీ, కోడల్ని కానీ తెర మీదకు చంద్రబాబు తీసుకురాలేదు. కానీ తాజాగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సాగుతున్న ఆందోళనలకు వీరిని రంగంలోకి దించటం కొత్త వాదనలకు తెర తీస్తోంది.
విమర్శలను లెక్క చెయ్యకుండా రాజకీయ అజెండాతో వచ్చిన భువనేశ్వరి
మొన్నటికి మొన్న రాజధానిగా అమరావతి కొనసాగించాలని చేస్తున్న దీక్షలకు విరాళంగా తన రెండు గాజుల్ని ఇచ్చిన భువనేశ్వరి తొలిసారి రాజకీయ ఎజెండాతో ప్రజల మధ్యకు వచ్చారు. ఇక ఎన్నడూ మాట్లాడని విధంగా ఆమె ఆ దీక్షా శిబిరంలో మాట్లాడారు. వైసీపీ నేతలు సైతం భువనేశ్వరి టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు. అయినప్పటికీ మరోమారు సంక్రాంతి పండుగ కు దూరంగా రాజధాని రైతుల కోసం భువనేశ్వరి, తనతో పాటు కోడలు బ్రాహ్మణిని కూడా తీసుకుని వచ్చారు.
భువనేశ్వరి , బ్రాహ్మణి సమర్దులనే భావన .. అందుకే చంద్రబాబు ప్లాన్ ?
ఇక దీనితో విమర్శలను కూడా లెక్క చెయ్యకుండా భువనేశ్వరి రావటమే కాకుండా బ్రాహ్మణిని తీసుకుని రావటం తన తర్వాతి రాజకీయ వారసుల విషయంలో బాబు వ్యూహంలో భాగమా ? అన్న కొత్త చర్చ జరుగుతుంది . చంద్రబాబు పార్టీకి సంబంధించిన గ్రిప్ తన కుటుంబం చేతిలో నుండి పోకుండా బ్రాహ్మణిని కూడా రంగం లోకి దించే ఆలోచనలో ఉన్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది . తాజాగా సందర్శించిన దీక్షా శిబిరంలో బ్రాహ్మణి ఏమీ మాట్లాడకుండా మొత్తాన్ని గమనిస్తూ ఉంటే, భువనేశ్వరి మాత్రం ప్రసంగించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ తెలివైనవారు, సమర్ధులు అని పేరున్న నేపధ్యంలో వారి ద్వారా టీడీపీని ముందుకు నడపాలని చంద్రబాబు భావిస్తున్నారా ? అన్నది తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.