మేడం, ఒక్కరోజు ముందే రండి: భువనేశ్వరితో అధికారుల సరదా వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిని శనివారం పూటే అమరావతికి రావాలని ఏపీకి చెందిన కొందరు అధికారులు సరదాగా కోరారని సమాచారం. అధికారిక కార్యక్రమాలకు కొంత సేపు విరామం దొరుకుతోందనే ఉద్దేశ్యంతోనే అధికారులు భువనేశ్వరిని కోరారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
వారానికి ఒక్క పూట, ఆమె సహకారం: భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికరం
ప్రతి ఆదివారం పూట భువనేశ్వరి అమరావతికి వస్తారు.అయితే కుటుంబసభ్యులతో గడిపేందుకు చంద్రబాబునాయుడు ఆదివారం నాడు అధికారిక కార్యక్రమాలకు విరామం ఇస్తారు.
అయితే ఏపీ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబునాయుడు అధికారులతో నిత్యం సభలు, సమావేశాలతో బిజీగా ఉంటున్నారు.అధికారులు కూడ క్షణం తీరిక లేకుండా గడపాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
భువనేశ్వరిని ఒక్కరోజు ముందే అమరావతికి రావాలన్న అధికారులు
కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి అమరావతికి వచ్చారు. అయితే ఆ సమయంలో కొందరు అధికారులు ఆమెతో సరదాగా ఓ విన్నపం చేశారని అధికారుల్లో ప్రచారం సాగుతోంది. ప్రతి ఆదివారం కాకుండా శనివారం రోజునే అమరావతికి రావాలని వారు కోరారని సమాచారం. శనివారం భువనేశ్వరి హైద్రాబాద్ నుండి అమరావతికి వస్తే సమీక్షలు, సమావేశాల నుండి తమకు విముక్తి లభిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని సరదాగా ఆమె వద్ద ప్రస్తావించారని ప్రచారం సాగుతోంది.
Recommended Video
విశ్రాంతి లభిస్తోందని భావన
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఆదివారం ఉదయం పూట అమరావతికి వస్తున్నారు. అయితే ఆదివారం ఎలాగో అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి రావడంతో శనివారం అర్ధరాత్రి వరకు చంద్రబాబునాయుడు సమీక్షలు, సమావేశాలను నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో తమకు కొంత ఇబ్బంది అవుతోందని అధికారుల భావనగా ఉంది. ఈ కారణంగానే ముందు రోజే కుటుంబసభ్యులు అమరావతికి వస్తే శనివారం రాత్రి వరకు సమీక్షలు ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారని సమాచారం.
వారానికి ఒకపూట
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో విపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం వరకు మాత్రమే పార్టీ సమావేశాలకు చంద్రబాబునాయుడు నిర్వహించేవారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ సమావేశాలను నిర్వహించేవారు కాదు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు అమరావతి నుండి పాలన సాగిస్తున్నారు.దీంతో భువనేశ్వరి ప్రతి ఆదివారం నాడు అమరావతికి వస్తున్నారు. కుటుంబసభ్యులు అమరావతికి వచ్చిన సమయంలో బాబు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గతంలో కూడ ఇదే తరహలో వ్యవహరించేవారు.అయితే అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మాత్రం సమావేశాలు నిర్వహిస్తారు.
పరిస్థితుల్లో మార్పు వచ్చేనా
ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు వ్యవహరించిన సమయంలో ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించారనే పేరుంది. 2004 ఎన్నికల సమయంలో టిడిపి ఓటమికి ఉద్యోగుల వ్యతిరేకత కూడ కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే 2014 ఎన్నికల ముందు ఉద్యోగుల విషయంలో తన వైఖరి మారిందని ఆయన ప్రకటించారు.ఇటీవల కొన్ని సమావేశాల్లో ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు ప్రస్తావించారు.