దివ్యాంగురాలి సజీవదహనం : కేసును చేధించిన పోలీసులు.. ఆరోజు,అంతకుముందు ఏం జరిగిందంటే...
ప్రకాశం జిల్లా ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. వార్డు వలంటీర్ భువనేశ్వరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్దారించారు. ఆర్థిక,అనారోగ్య సమస్యలతోనే భువనేశ్శరి ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 18న భువనేశ్వరి(22) తన స్నేహితుడైన ఓ ఆటో డ్రైవర్ ద్వారా పెట్రోల్ కొనుగోలు చేసిందన్నారు. అనంతరంమూడు చక్రాల కుర్చీలో పట్టణ శివార్లలోని దశరాజుపల్లి రహదారి వైపు వెళ్లిందన్నారు. రాత్రి 8.49గంటలకు కొంతమంది తమకు ఫోన్ చేసి ఎవరో కాలిపోతున్నట్లు సమాచారమిచ్చినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకునేసరికే భువనేశ్వరి సజీవ దహమైందన్నారు.
చిన్నతనంలోనే తండ్రి మరణం,సోదరి అనారోగ్యం పాలవడం,తను కూడా దివ్యాంగురాలు కావడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు చెప్పారు. ఈ కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఓ యాప్లో తన స్నేహితులకు భువనేశ్వరి ఇటీవల కొన్ని మెసేజ్లు పెట్టినట్లు గుర్తించామన్నారు. తన జీవితానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని భువనేశ్వరి అందులో పేర్కొన్నట్లు చెప్పారు. ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు కూడా ఇదే తన ఆఖరి మెసేజ్ అని స్నేహితులకు మెసేజ్ పెట్టిందన్నారు.
గత 15 రోజులుగా ఆమె స్నేహితులకు ఇలాంటి మెసేజ్లు పెడుతున్నా... వారెవరూ పట్టించుకోకపోవడం,ఆమె ఆత్మహత్యను ఆపే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. కనీసం పోలీసులకు సమాచారమిచ్చినా ఆమెకు తగిన కౌన్సెలింగ్ ఇచ్చేవారమని తెలిపారు. భువనేశ్వరిది ఆత్మహత్యే అని స్పష్టమైనా కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తుండటం సరికాదన్నారు.