నా అదృష్టం: భువనేశ్వరి, ఏజెంట్లని నమ్మొద్దు: అమెరికా వెళ్లే విద్యార్థులకు పల్లె
హైదరాబాద్/విశాఖ: స్వర్గీయ నందమూరి తారక రామారావుగా పుట్టడమే తన అదృష్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఈ నెల 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ రోజున లెజెండరీ బ్లెడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు జాతికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన ఎన్టీఆర్ మహనీయుడన్నారు.
రక్తదానం పైన ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలన్నారు. ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న మెగా రక్త దాన శిబిరంలో ఎన్టీఆర్ అభిమానులంతా పాల్గొనాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ చనిపోయి ఇరవై ఏళ్లయినా అందరి మదిలో ఉన్నారన్నారు.
జియో అమరావతి మారథాన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, హీరో రామ్
అమరావతి కేంద్రంగా జాతీయ క్రీడలను విజయవంతంగా నిర్వహించి అనంతరం ఒలింపిక్స్ను తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం అన్నారు. అమరావతి రాజధాని మహాసంకల్పమే లక్ష్యంగా తొలిసారిగా నిర్వహించిన ‘జియో అమరావతి మారథాన్' ఆదివారం విజయవంతంగా పూర్తయింది.
విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక స్టేడియం నుంచి ఆదివారం ఉదయం 21కె, 10కె, 5కె రన్లు నిర్వహించారు. 6500 మంది పరుగులో పాల్గొన్నారు. కెన్యా, ఇథియోపియా వంటి దేశాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన పరుగు వీరులు ఇందులో పాల్గొన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, హీరో రామ్ కూడా పాల్గొన్నారు. మారథాన్ పరుగును వెంకయ్య జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
అమెరికా వెళ్లే విద్యార్థులకు పల్లె సూచన
అమెరికా వెళ్లే విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం సూచించారు. ఏజెంట్లు నకిలీ ధ్రువపత్రాలతో విదేశాలకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఏజెంట్లను నమ్మి విద్యార్థులు మోసపోవద్దని హెచ్చరించారు.