‘విభజనతో కొత్త సమస్యలు, ఏపీకి న్యాయం చేయాలి’: హోదాకు మద్దతుగా ఎస్పీ ఎంపీ
న్యూఢిల్లీ: పార్లమెంటులో మంగళవారం జరిగిన చర్చలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై రాజ్యసభలో చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సమాజ్వాదీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ మాట్లాడారు.
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఆయన సభకు గుర్తు చేశారు. విభజనల వల్ల ఆయా రాష్ట్రాల్లో అనేక సమస్యలు నెలకొంటున్నాయని వివరించారు.
పంజాబ్, హర్యానా విడిపోయినా ఇప్పటికీ నదీ జలాల విషయంలో కత్తులు దూసుకుంటున్నాయని రాంగోపాల్ యాదవ్ చెప్పారు. సట్లేజ్ నది నీళ్లు హర్యాకు చేరడంలేదని తెలిపారు.
కృష్ణా, గోదావరికి సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు వస్తాయని తెలిపారు. ప్రత్యేక హోదా కల్గిన ఉత్తరాఖండ్లో ఎలాంటి సౌకర్యాలూ లేవన్నారు. ఉత్తరాఖండ్లో వాహనాలు లోయలో పడే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా.. ఒక్క కూడా ట్రామా సెంటర్ లేదన్నారు.
సీపీఐ సభ్యుడు డీ రాజా మాట్లాడుతూ.. తాము విభజనకు మద్దతు ఇచ్చామని, ఆ సమయంలో తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. హోదా ఇవ్వాలని బీజేపీ సభ్యులే అప్పుడు అడిగారు.. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం అంటూ తప్పించుకుంటున్నారని మండిపడ్డారు.