నన్నపనేని, ఎర్రబెల్లి: ఒకే వేదిక, టీపై భిన్నవాదనలు
హైదరాబాద్: రాష్ట్ర విభనజ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. పార్టీ తెలంగాణ నాయకులు ఓ వాదనను, సీమాంధ్ర నాయకులు మరో వాదనను వినిపిస్తున్నారు. మంగళవారంనాడు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. పార్టీ తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, సీమాంధ్ర నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఒకే వేదిక మీది నుంచి రెండు భిన్న వాదనలు వినిపించారు.
పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మంగళవారం ఉదయం ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణకు అనుకులంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణకు అంగీకరించబోమని చెప్పారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై విమర్శలు కురిపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉతికి ఆరేశారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం ఎప్పుడైపోతుందా అంటూ అక్కడే నన్నపనేని రాజకుమారి నిరీక్షిస్తూ వచ్చారు. ఎర్రబెల్లి తన మీడియా సమావేశాన్ని ముగించి వెళ్లిపోతుండడం, నన్నపనేని రాజకుమారి వస్తుండడం ఒకేసారి జరిగాయి. ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత నన్నపనేని రాజకుమార్ వచ్చి విభజనను వ్యతిరేకించలేదు గానీ తెలంగాణ బిల్లును ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విభజన తీరును తప్పు పడుతూ ఆమె మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీలో దాదాపు నిత్యం ఈ రెండు వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. సీమాంధ్రకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద రావు వంటివాళ్లు విభజనను తప్పు పడుతూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడడం, తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతూ వస్తోంది.