విద్యార్థుల్లో ఆందోళన: తెలంగాణకు జెఇఇ చిక్కులు
హైదరాబాద్: దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ తాజాగా మరో సమస్యను ఎదుర్కుంటోంది. ఐఐటి జెఇఇ విషయంలో అది సమస్యను ఎదుర్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అత్యంత కీలకమైన సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) వద్ద ఉన్న జాబితాలో మాత్రం ‘తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు' లేదు. దీంతో అత్యంత కీలకమైన జేఈఈ-మెయిన్స్ పరీక్షలు రాయనున్న తెలంగాణ విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఈ మేరకు గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇప్పటికే సమర్పించిన దరఖాస్తును ‘సవరించడం' ఎలాగో తెలియని తికమక పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని సీబీఎస్ఈని సంప్రదించి తగిన చర్యలు తీసుకోకపోతే జేఈఈ-మెయిన్స్లో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదముంది. జేఈఈ మెయిన్స్ పరీక్షకు డిసెంబర్ 18వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. దరఖాస్తు చేసుకునే సమయంలోతాము ఏ ఇంటర్మీడియ్ బోర్డు నిర్వహించే పరీక్షలు రాస్తున్నదీ విద్యార్థులు దరఖాస్తు ఫామ్లో (ఆన్లైన్) పేర్కొనాలి.
అప్పటికి ఇంకా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు కాలేదు. ఆ జాబితాలో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమే ఉంది. దీంతో తెలంగాణ విద్యార్థులు సైతం ‘ఏపీ బోర్డు'నే ఎంచుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పడింది. విద్యార్థులు ఈ బోర్డు ద్వారానే ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. వారికి తెలంగాణ బోర్డే సర్టిఫికెట్లు జారీ చేస్తుంది.
జేఈఈ-మెయిన్స్ దరఖాస్తు పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ర్యాంకులు, అడ్మిషన్లలో తమను ఏ రాష్ట్రానికి చెందిన వారిగా పరిగణిస్తారన్న ప్రశ్న విద్యార్థులను వేధిస్తోంది. జేఈఈ మెయిన్స్లో ఇంటర్మీడియట్ మార్కులకు 40శాతం వెయిటేజీ ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్షకు 60 శాతం మార్కులు ఉంటాయి. అయితే దరఖాస్తులో ఏపీ బోర్డుగా పేర్కొని, ఇంటర్ పరీక్షలు తెలంగాణ బోర్డు పరిధిలో రాస్తే 40శాతం ఇంటర్ మార్కుల వెయిటేజీ జాబితాను సీబీఎస్ఈకి ఎవరు ఇస్తారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన లక్షన్నర మందిని మాత్రమే జేఈఈ మెయిన్స్ పరీక్షకు అనుమతి కల్పిస్తారు. జేఈఈ-అడ్వాన్స్లో ర్యాంకు సాధించిన విద్యార్థి తాను పరీక్ష రాసిన ఇంటర్మీడియట్ బోర్డులోనూ టాప్-20 పర్సంటైల్లో ఉండాలి. లేదా 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. సీబీఎస్ఈ ఇప్పటికీ తెలంగాణ ఇంటర్ బోర్డును గుర్తించకపోవడంతో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.