పార్క్ హయత్ నిమ్మగడ్డ రహస్య భేటీ వెనుక పెద్ద కుట్ర .. వెనుక ఉంది చంద్రబాబే : వైసీపీ మంత్రులు
ఏపీ రాజకీయాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి,కామినేని శ్రీనివాసులు పార్క్ హయత్ హోటల్ వేదికగా రహస్య భేటీ కావడం, ఇక ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద రాజకీయ దుమారం కొనసాగుతోంది. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్ లో ఈ నెల 13వ తేదీన రహస్యంగా సమావేశమైన వీరు ముగ్గురూ గంట సేపు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఒకపక్క ఎన్నికల సంఘం వివాదం కొనసాగుతున్న తరుణంలో వీరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయ నాయకులతో భేటీ అవుతారా
ఇక పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు బీజేపీ నేతలు భేటీ కావడంపై వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇక ఈ రహస్య సమావేశం వెనుక కుట్ర దాగి ఉందని వైసిపి మంత్రి ఆదిమూలపు సురేష్ అనుమానం వ్యక్తం చేశారు.రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ,రాజకీయ నాయకులుగా ఉన్న సుజనాచౌదరి కామినేని శ్రీనివాసరావులతో ఎలా భేటీ అవుతారని ఆయన ప్రశ్నించారు.
దళిత ఎన్నికల కమీషనర్ కు వ్యతిరేకంగానే కుట్ర
దళిత జడ్జిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తే, దళిత ఎన్నికల కమిషనర్ కు వ్యతిరేకంగానే కుట్ర జరిగిందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇక మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని వ్యాఖ్యానించిన మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని పావుగా వాడి వైసీపీ ప్రభుత్వం పై కుట్ర చేస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు.
విచారణ జరిపిస్తాం కుట్ర కోణాన్ని ఛేదిస్తాం
ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ,సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ రహస్య భేటీ కి సంబంధించిన కుట్ర మొత్తం వీడియోలతో బయటపడిందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఆ రహస్య భేటీ లో ఏం జరిగింది విచారణ జరిపిస్తామని, దీని వెనుక కుట్ర ఏంటో తేలుస్తామని , ఇక సుప్రీం కోర్టుకు వాస్తవాలను వెల్లడిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు.
నిమ్మగడ్డ రమేష్ ఏమిటో అందరికీ అర్ధం అయింది
ఇక నిమ్మగడ్డ రహస్య భేటీపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఏమిటన్నది ఈ వీడియోతో తేలిపోయింది అని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లుగా వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్నవి ఆరోపణలు కావని, నిజాలని రుజువైందని ఆయన పేర్కొన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమని వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శించారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్లు బీజేపీ నేతలు కాదని.. వారు బాబు జనతా పార్టీ నాయకులని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు.